యాప్నగరం

ఆ ఓట్లన్నీ టీడీపీవి కావు.. సంబరాలతో ఏమీ అయిపోలేదు: సజ్జల

AP MLC Election results: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతను ఎంతమాత్రం ప్రతిబింబించవని స్పష్టం చేశారు. అసలు టీడీపీకి వచ్చిన ఆ ఓట్లన్నీ ఆ పార్టీవి కావన్నారు. సీపీఎం, సీపీఎం ఇతర పార్టీల ఓట్లు టీడీపీకి పోలయ్యాయని వివరించారు. ఈ ఫలితాలు తమకు ఎంతమాత్రం హెచ్చరిక కాదని పేర్కొన్నారు. అయితే, ఫలితాలపై సమీక్ష మాత్రం చేసుకుంటామని వ్యాఖ్యానించారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 19 Mar 2023, 12:56 am

ప్రధానాంశాలు:

  • ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు.
  • ఈ ఫలితాలు ప్రజా వ్యతిరేకతను ఏమాత్రం ప్రతిబింబించవని వ్యాఖ్య.
  • పోలైన ఓట్లన్నీ టీడీపీవి కావని.. అన్ని వర్గాల ప్రజలను ప్రతిబింబించవని పేర్కొన్న సజ్జల.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sajjala Ramakrishna Reddy
సజ్జల రామకృష్ణారెడ్డి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏ రకంగానూ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలించవని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ ఫలితాలను తాము హెచ్చరికగా ఎంతమాత్రం భావించడం లేదని ఆయన స్పష్టంచేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లన్నీ ఆ పార్టీవి కావని సజ్జల వ్యాఖ్యానించారు. పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లు టీడీపీ వైపు మళ్లాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఈసారి ఆ పార్టీల మధ్య అంగీకారం కుదిరిందని అన్నారు. ఒక వర్గం ఓటర్లను రాష్ట్రం మొత్తానికి ఎలా అపాదిస్తారని సజ్జల ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని సజ్జల అన్నారు. టీడీపీ సంబరాలు చేసుకోవడంతో అంతా అయిపోలేదని, తాము డీలా పడాల్సింది అంతకంటే ఏమీలేదని ఆయన అన్నారు.
‘ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత నాలుగేళ్లుగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆ సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లు లేరు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదు’ అని సజ్జల వ్యాఖ్యానించారు. ‘మొత్తం ఓట్లు రెండు లక్షలు ఉంటాయి. వాటిలో పోలైనవి ఎన్ని? చెల్లినవి ఎన్ని.. అన్నీ చూడాలి’ అని సజ్జల వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ పోటీ చేసిందని పేర్కొన్న సజ్జల.. తెలంగాణలో చేసిన తరహాలోనే ఏవైనా ప్రయత్నాలు చేయొచ్చునని ఘాటు విమర్శలు చేశారు. పరోక్షంగా ‘ఓటుకు నోటు’ కేసు గురించి ప్రస్తావించారు.


ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 3 పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 3 చోట్లా టీడీపీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. ఉత్తరాంధ్ర స్థానంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు భారీ ఆధిక్యంతో విజయం సాధించగా.. తూర్పు రాయలసీమలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌, పశ్చిమ రాయలసీమ స్థానంలో టీడీపీ బలపరిచిన భూమి రెడ్డి రామగోపాలరెడ్డి గెలుపొందారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.