యాప్నగరం

ఈసీ నిమ్మగడ్డ రమేష్ మళ్లీ దూకుడు: స్థానిక ఎన్నికలకు ఈ పార్టీలు రెడీ.. జగన్ వ్యూహం ఇదే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు.

Samayam Telugu 27 Oct 2020, 8:19 pm
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి వేడెక్కుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. ఈ నిర్ణయాన్ని జగన్ సర్కారు తీవ్రంగా తప్పుపట్టింది. తాజాగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల నిర్వహణకు దూకుడు పెంచారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం ఎన్నికలను నిర్వహించేది లేదని ఏపీ మంత్రులు ఇప్పటికే ప్రకటించారు.
Samayam Telugu నిమ్మగడ్డ రమేష్, సీఎం జగన్


ఈ నేపథ్యంలో బుధవారం ఆల్‌ పార్టీ నాయకులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. బుధవారం ‌ఉదయం 10.40కి అఖిలపక్ష సమావేశం జరపనున్నారు. ఇందులో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ ప్రతినిధులను పంపాలని ఎన్నికల కమిషన్ లేఖలు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు ఎన్నికల కమిషన్ తీసుకోనుంది.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, బీజేపీ నుంచి పాక సత్యనారాయణ ఎన్నికల కమిషన్ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన, సీపీఎం, వైసీపీ ప్రతినిధులు హాజరయ్యే అంశం ఇంకా ఖరారు కాలేదు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే మెజార్టీ పక్షాలు మొగ్గు చూపుతున్నాయి.

అయితే ఎన్నికల నిర్వహణ కరోనా ఉద్ధృతి కారణంగా ఇప్పుడు సాధ్యం కాదని ఇప్పటికే అధికార పార్టీ మంత్రులు తేల్చిచెప్పారు. అదేసమయంలో నవంబర్ 4వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసే వరకు (వచ్చే ఏడాది మార్చి 31) ఎన్నికలు జరపకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.