యాప్నగరం

ఏపీ కేబినెట్ విస్తరణ: అసెంబ్లీకి కొత్త స్పీకర్.. ఆయనకే ఛాన్స్ ఇస్తారట!

ఏపీ కేబినెట్ విస్తరణపై ప్రచారం జరుగుతుండటంతో స్పీకర్ తమ్మినేని పేరు తెరపైకి వచ్చింది. ఒకవేళ సీతారాంను మంత్రివర్గంలోకి తీసుకుంటే.. కొత్త స్పీకర్ ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది.

Samayam Telugu 20 Jul 2020, 11:29 am
ఏపీలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. శ్రావణమాసంలో ఖాళీగా ఉన్న రెండు మంత్రు పదవుల్ని భర్తీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఈ నెలలోనే ముహూర్తం ఫిక్స్ చేసినట్లు టాక్ నడిచింది. కేబినెట్ విస్తరణపై చర్చ జరుగుతుండటంతో ఆశావహుల జాబితా కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
Samayam Telugu ఏపీ అసెంబ్లీ


తమ్మినేనినికి తనను అంతా అధ్యక్షా అని పిలవడం గౌరవంగా ఉన్నా.. అమాత్యా అని పిలవాలన్న ఆశ ఉందట. ఆయన ఎక్కడా మనసులో దాచుకోకుండా బయట పెట్టేసుకున్నారు. ఈ మధ్యనే జగన్‌ని సతీసమేతంగా కలసి తన విన్నపాన్ని తెలియచేశారని ప్రచారం జరుగుతోంది. తమ్మినేని గతంలో ఎన్నోసార్లు మంత్రిగా చేసిన అనుభవం ఉంది. తమ్మినేనికి పదవి ఇవ్వడం వెనుకా శ్రీకాకుళం జిల్లాలో సామాజిక సమీకరణలు ఉన్నాయట. కాంగ్రెస్ హయాంలో కాళింగులకు ప్రాధాన్యం ఇవ్వగా.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వెలమలకు పెద్ద పీట వేశారట. దీంతో కాళింగులకు పదవులు దక్కలేదట. ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేనికి మంత్రి పదవి ఇస్తే అచ్చెన్నాయుడు మీద గట్టిగ విరుచుకుపడతారని, జిల్లా రాజకీయాలను ఒక లెక్కలోకి తెస్తారని జగన్ నమ్ముతున్నారట. అందుకే ఆయనకు మంత్రి పదవి ఖాయం అంటున్నారు.

తమ్మినేనికి మంత్రి పదవి దక్కితే అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కోన రఘుపతికి ఆ అవకాశం దక్కుతందని ప్రచారం జరుగుతోంది. తండ్రి సభాపతిగా చేశారు.. కుమారుడు ఉప సభాపతి దాకా వచ్చారు అని ఏడాది క్రితం చర్చ జరిగింది. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు నాలుగు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీకి స్పీకర్‌గా పనిచేశారు. ఆయన చాలా సీనియర్ నేతగా ఉండేవారు.. ఎన్నికల తర్వాత రఘుపతికి స్పీకర్ పదవి దక్కుతందని భావించారు కానీ ఛాన్స్ రాలేదు. అయితే ఇప్పుడు కేబినెట్ విస్తరణపై ప్రచారం జరుగుతుండటంతో తమ్మినేని పేరు తెరపైకి వచ్చింది. అదే జరిగితే రఘుపతికి స్పీకర్ పదవి ఖాయమంటున్నారట.

కోన రఘుపతికి అసెంబ్లీ స్పీకర్ పదవి ఇవ్వడం ద్వారా స్పీకర్ పదవి వివాదం కాకుండా ఉంటుందని భావిస్తున్నారట. కోన చాలా సౌమ్యుడు, పైగా సభాపతి నియమాలు, మర్యాదా కాపాడుతారని ముఖ్యమంత్రి జగన్ సైతం భావిస్తున్నారట. అలాగే బ్రాహ్మణ సామాజికవర్గానికి అతి కీలకమైన పదవితో న్యాయం చేసినట్లు అవుతుందని అనుకుంటున్నారట. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే జగన్ తమ్మినేనికి మంత్రి పదవి ఇస్తూ కోన రఘుపతికి అక్కడ లైన్ క్లియర్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.. ముఖ్యమంత్రి ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళాతారన్నది చూడాలి మరి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.