యాప్నగరం

AP New Chief Secretary: ఏపీకి కొత్త సీఎస్.. నీలం సాహ్నీ స్థానంలో ఆయనవైపు సీఎం జగన్ మొగ్గు, లైన్ క్లియర్!

నీలం సాహ్ని తర్వాత సీనియార్టీలో ఆమె భర్త అజయ్‌ సాహ్ని, తర్వాతి స్థానంలో సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్‌ త్రిపాఠి, సతీష్‌ చంద్ర, జేఎస్వీ ప్రసాద్‌, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉన్నారు.

Samayam Telugu 10 Dec 2020, 1:08 pm
ఏపీకి కొత్త సీఎస్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నెలాఖరుతో నీలం సాహ్నీ పదవీ కాలం ముగుస్తుండటంతో కొత్త సీఎస్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. ఈ రేసులో ఆదిత్యనాథ్‌ దాస్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.. ఆయన వైపే సీఎం జగన్‌ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. సాధారణంగా ప్రస్తుత సీఎస్‌ పదవీ కాలం ముగిసే రోజు కొత్త సీఎస్‌ నియామక ఉత్తర్వులు వెలువడతాయి. ఆ దిశగా కొన్ని మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ను సీఎస్‌ కార్యాలయంలో ఓఎస్డీగా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. నెలాఖరు వరకూ ఓఎస్డీగా ఉంటూ పాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకోడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
Samayam Telugu ఏపీకి కొత్త సీఎస్


ఆదిత్యనాథ్‌ దాస్‌ సొంత రాష్ట్రం బీహార్‌. తల్లిదండ్రులు డాక్టర్‌ గౌరీ కాంత్‌ దాస్‌, కుసుం కుమారి. 1987వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్‌ (1980-84), ఢిల్లీలోని జేఎన్‌యూలో ఇంటర్నేషనల్‌ స్టడీస్‌(1984-86) చేశారు. విజయనగరం, విజయవాడ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, కృష్ణాజిల్లా జేసీగా, వరంగల్‌ కలెక్టర్‌గా, మురికివాడల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్‌, మునిసిపల్‌ పరిపాలన కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌, నీటి పారుదల శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కూడా ఆయన సేవలందించారు.

ఇటు నీలం సాహ్ని తర్వాత సీనియార్టీలో ఆమె భర్త అజయ్‌ సాహ్ని, తర్వాతి స్థానంలో సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్‌ త్రిపాఠి, సతీష్‌ చంద్ర, జేఎస్వీ ప్రసాద్‌, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉన్నారు. వీరిలో అజయ్‌ సాహ్ని, సమీర్‌ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉండగా.. అభయ్‌ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీభవన్‌లో పనిచేస్తున్నారు. సతీష్‌చంద్ర చంద్రబాబు పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేయడంతో సుముఖత వ్యక్తం చేయలేదట. జేఎస్వీ ప్రసాద్‌వైపు మొగ్గు చూపడం లేదట.

నీరబ్‌ కుమార్‌ సీఎస్‌ అవుతారని గతంలో ప్రచారం జరిగాన.. ఆయనకు 2024 జూన్‌ వరకూ పదవీకాలం ఉంది. ఆయనను సీఎస్‌గా నియమిస్తే మధ్యలో కొంతమందికి ఆ అవకాశం దూరమవుతుంది. సుదీర్ఘకాలం ఒకరినే సీఎస్‌గా కొనసాగించాలి.. అందుకే ఆదిత్యనాథ్‌ వైపే సీఎం మొగ్గుచూపారని చెబుతున్నారు. దాస్‌ జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.