యాప్నగరం

YS Jagan ఓకే అంటే పవన్ ఫ్యూచర్ ఏంటి.. అదే జరిగితే జనసేనాని పయనమెటు!

ఎన్డీఏలో వైఎస్సార్‌సీపీ చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సీఎం జగన్‌తో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్‌లో చేరాలని కోరారని ఊహాగానాలు వస్తున్నాయి.

Samayam Telugu 6 Oct 2020, 2:01 pm
ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన.. ఎన్డీఏలో వైఎస్సార్‌సీపీ చేరే అవకాశం ఉందనే ప్రచారంతో అమరావతి నుంచి ఢిల్లీ వరకు కొత్త చర్చ తెరపైకి వస్తోంది. సీఎం జగన్‌తో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్‌లో చేరాలని కోరారని.. మొత్తం మూడు పదవులు ఇస్తామని చెప్పారని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.. కానీ బీజేపీ, వైఎస్సార్‌సీపీ వర్గాలు మాత్రం స్పందించడం లేదు. అయితే మోదీ వైఎస్సార్‌సీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించిన మాట నిజమేనని.. జగన్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనేది మరో వాదన.
Samayam Telugu పవన్ కళ్యాణ్


ఢిల్లీలో ఊహాగానాలు అలా ఉంటే.. ఒకవేళ జగన్ ఎన్డీఏలో చేరాలని నిర్ణయం తీసుకుంటే ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీతో జతకట్టిన జనసేన పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. 2014 ఎన్నికల్లో పోటీచేయకపోయినా టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్.. 2019లో మాత్రం ఆ పార్టీకి దూరమయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీచేసినా ఫలితం లేకుండా పోయింది.. జనసేనకు ఒక్క సీటు మాత్రమే వచ్చింది.

తర్వాత పవన్ మళ్లీ బీజేపీతో దోస్తీకి సై అన్నారు. అంతేకాదు ఇటీవలే బీజేపీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేసింది.. కన్నా లక్ష్మీనారాయణకు బదులు సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించింది.. పవన్ సీఎం అభ్యర్థి అన్న రేంజ్‌లో సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అంతేకాదు చిరంజీవి కూడా బీజేపీకి వెళతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇటీవల ఇరు పార్టీల నేతలు స్పీడు పెంచారు.. కలిసి ఉద్యమాలు చేస్తున్నారు. రాష్ట్రంలో సమస్యలు, విగ్రహాల ధ్వంసం, ఇతర నిరసన కార్యక్రమాలు జోరుగా చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్సార్‌సీపీ బీజేపీతో జతకడుతుందనే వార్తలు జనసేనకు మింగుడు పడటం లేదు. అటు టీడీపీతో కలవలేని పరిస్థితి.. వామపక్షాలు ఇక పవన్‌తో కలిసి పనిచేసే పరిస్థితి లేదు.. ఫైనల్‌గా జనసేన సోలో అవుతుందనేది విశ్లేషణ.

జగన్ కేంద్రంలో చేరితే ఏపీలో పవన్ కళ్యాణ్ ఒంటరి అయినట్లే చెప్పాలి. ఒకవేళ జగన్ పార్టీ కేంద్రంలో చేరినా.. జనసేన కూడా బీజేపీతో పాటూ కొనసాగినా ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ప్రజా సమస్యలు, ఏవైనా అంశాలపై ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉన్న పార్టీపై నిరసనలు, ఆందోళనలు చేయడానికి ఉండదు. నిజంగానే బీజేపీ వైఎస్సార్‌సీపీని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తే.. అధినేత జగన్ ఓకే చెబితే పవన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పొలిటికల్ సస్పెన్స్‌కు ఎలా తెరపడుతుందో తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.