యాప్నగరం

Pawan Kalyan: డ్రోన్ రాజకీయాలు ఆపండి, ప్రజలను కాపాడండి.. జనసేనాని

Krishna కరకట్టపై నిర్మాణాలకు సంబంధించి ఏపీలో జరుగుతున్న రాజకీయాలపై జనసేన అధినేత పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్ రాజకీయాలు ఆపి, ప్రజలకు సాయపడాలని అధికార, ప్రతిపక్ష హితవు పలికారు.

Samayam Telugu 17 Aug 2019, 7:38 pm
రాజకీయాలు, కక్ష సాధింపులు పక్కన పెట్టి వరదల్లో చిక్కుకున్న ప్రజలను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. డ్రోన్ రాజకీయాలను ఆపేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిని ముంచేస్తారా అని ప్రతిపక్షం, మునిగిందా లేదా అని చూసేందుకు ఆసక్తి కనబరుస్తూ అధికార పక్షం అనవసర రాజకీయాలు చేస్తున్నారని.. బాధల్లో ఉన్న ప్రజలను వరద నీటికి వదిలేశారని పవన్ మండిపడ్డారు. రాజకీయాలు, కక్ష సాధింపులు ఏవైనా ఉంటే తర్వాత చూసుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు శనివారం (ఆగస్టు 17) సాయంత్రం జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
Samayam Telugu Pawan
పవన్ కళ్యాణ్


కృష్ణా నది వరద కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లు పడుతుంటే.. వారికి సహాయం చేయాల్సి పోయి మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరుగుతూ రాజకీయాలు చేస్తు్న్నారని పవన్ ధ్వజమెత్తారు. వరద ఉధృతి ఉన్నప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడటం ప్రభుత్వం విధి అని గుర్తు చేశారు.

Read Also: భవనాన్ని ఖాళీ చేయండి.. చంద్రబాబు ఇంటికి నోటీసులు

‘ఇది విపత్కాలం. వరద బాధల్లో ఉన్న పేదలను కాపాడండి. 151 సీట్లు వచ్చిన అధికార పార్టీ ప్రజల పట్ల బాధ్యతతో సుపరిపాలన అందించాలి. విమర్శలకు తావిచ్చేలా వ్యవహరించడం మంచిది కాదు. జనసేన ఎప్పుడూ రాజకీయాల్లో హుందాతనం పాటించాలనే కోరుకొంటుంది’ అని పవన్ అన్నారు.

‘కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు మునిగిపోతాయా? లేదా అంటూ డ్రోన్లు ఎగరేసి చూడటమా మంత్రుల బాధ్యత. కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల పాటు బస చేసిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గృహం, అదే వరసలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడి నివాసంతో పాటు ప్రముఖుల ఇళ్లు, శారద పీఠం కార్యక్రమం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లిన ఆశ్రమం ఉన్నాయి. వరద ఉధృతి పెరిగితే అవన్నీ మునుగుతాయి. డ్రోన్ రాజకీయాలు అక్కర్లేదు. ముందుగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడి, వారికి కావాల్సిన అన్ని రకాల సహాయాలు చేయాలి’ అని పవన్ సూచించారు.

Read Also: గోడెక్కిన ఏపీ మంత్రులు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కత్తి దాడి జరిగినప్పుడు ఆయనకు ప్రభుత్వం తగిన భద్రత ఇవ్వాలని జనసేన స్పష్టంగా చెప్పిందని పవన్ గుర్తు చేశారు. నాటి పాలకపక్ష నేతలు ఆ దాడి జగన్ తల్లి విజయమ్మ చేయించారని ఆరోపణలు చేస్తే.. ఆవిధంగా మాట్లాడటం సరికాదని తప్పుబట్టామని.. ఏ తల్లీ తన కన్నబిడ్డను చంపుకోవాలని చూడదని చెప్పినట్లు వివరించారు. అలాంటి కువిమర్శలు తగవని చెప్పినట్లు తెలిపారు.

‘వరద బీభత్సం వేళ సాయం చేరడం లేదని ప్రజలు వాపోతున్నారు. కొద్ది రోజులు రాజకీయాలు పక్కనబెట్టి ముంపు బాధిత ప్రాంత ప్రజలకు, రైతులకు సహాయం చేయండి’ అని పవన్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.