యాప్నగరం

తహశీల్దార్ వనజాక్షికి కీలక పదవి.. చింతమనేనితో వివాదం తర్వాత మళ్లీ తెరపైకి

ఆంధ్రప్రదేశ్ తహశీల్దార్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికైన వనజాక్షి. చింతమనేని వివాదం తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచిన మహిళా తహశీల్దార్. తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానన్న వనజాక్షి.

Samayam Telugu 24 Sep 2019, 4:41 pm
తహశీల్దార్ వనజాక్షి.. రెండేళ్ల క్రితం ఈ పేరు ఏపీలో మార్మోగిపోయింది. టీడీపీ హయాంలో దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వనజాక్షిపై దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి వివాదానికి పుల్‌స్టాప్ పెట్టారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తహశీల్దార్ మరోసారి తెరపైకి వచ్చింది.. వార్తల్లో నిలిచారు.
Samayam Telugu vana.


Read Also: సీఎం జగన్ పీఏ పేరుతో ఫోన్ కాల్.. పడవ ప్రమాద బాధిత కుటుంబానికి బురిడీ

వనజాక్షి తహశీల్దార్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. గుంటూరు జిల్లా చినకాకానిలో జరిగిన ఏపీ తహశీల్దార్ల అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆప్టా అధ్యక్షుడిగా బీ రజినీకాంత్.. గౌరవ అధ్యక్షురాలిగా వనజాక్షిని ఎంపిక చేశారు. మిగిలిన కార్యవర్గం కూడా కొలువు దీరింది.. తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె చెప్పారు.

వనజాక్షి తహశీల్దార్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలిగా ఎంపికకావడంతో.. దీనికి కూడా రాజకీయ రంగు పులుముకుంటోంది. వాస్తవానికి ఇదంతా తహశీల్దార్ల అసోసియేషన్‌కు సంబంధించిన వ్యవహారమైనా తెలుగు తమ్ముళ్లు మాత్రం వదలడం లేదు. వనజాక్షిని టార్గెట్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు, అనుబంధ సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్‌లు పెడుతున్నారు. చింతమనేనితో వివాదానికి.. ఆమెకు పదవి రావడానికి లింక్ పెట్టేశారు.

టీడీపీ హయాంలో ఇసుక వివాదంలో అప్పటి దెందలూరు ఎమ్మెల్యే చింతమనేనితో జరిగిన గొడవ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. చింతమనేని వర్గీయులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆమె అడ్డుకోవడం.. ఈ క్రమంలో చింతమనేని తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. ప్రభాకర్ మాత్రం గొడవ జరుగుతుంటే తాను వెళ్లానని.. ఆమెపై దాడి చేయలేదని చెెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం పెద్ద వివాదంగా మారడంతో.. ఏకంగా చంద్రబాబు రంగంలోకి దిగారు.

చింతమనేనితో పాటూ వనజాక్షిని పిలిపించి మాట్లాడారు. ఇరువురికి సర్థిచెప్పి ఆ వివాదానికి అంతటితో ముగింపు పలికారు. దీన్ని అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ ఆయుధంగా చేసుకొని చింతమనేని టార్గెట్ చేసింది. వైఎస్ జగన్ కూడా అసెంబ్లీలో ఈ వివాదాన్ని ప్రస్తావించారు. ప్రభాకర్‌తో పాటూ అధికార పార్టీ టీడీపీపై విరుచుకుపడ్డారు. అప్పుడు ఈ వివాదం సమసిపోగా.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వనజాక్షి పేరు మళ్లీ వార్తల్లో నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.