యాప్నగరం

ఎకరానికి రూ.10 కోట్లు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజధాని తరలింపుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని తరలిస్తే అమరావతి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.

Samayam Telugu 18 Jan 2020, 8:14 pm
జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అమరావతి నుంచి రాజధాని తరలించాలనుకోవడం పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. అమరావతిలో రైతుల నుంచి 33 వేల ఎకరాలు సమీకరించామని.. రైతులకు ప్లాట్లు తిరిగి ఇచ్చిన తరువాత ప్రభుత్వం వద్ద పది వేల ఎకరాల భూమి ఉంటుందని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో అక్కడ భూముల ధరలు బాగా పెరిగాయని చంద్రబాబు అన్నారు.
Samayam Telugu tdp chief chandrababu naidu demands rs 10 crore compensation to amaravati farmers for one acre
ఎకరానికి రూ.10 కోట్లు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు


​అమరావతిలో ఎకరం పది కోట్లు..

అమరావతిలో ఎకరం భూమి విలువ సుమారు 10 కోట్ల రూపాయలు పలుకుతోందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న పది వేల ఎకరాల భూముల విలువ లక్ష కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. అలాంటి ది రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు పూనుకున్నారని ధ్వజమెత్తారు. మున్ముందు ఆ భూమి విలువ రెండు లక్షల కోట్లకు పెరుగుతుందని చంద్రబాబు అంచనాలు వేశారు.

పది కోట్లు చెల్లించాలి..

అమరావతి నుంచి రాజధాని తరలించాలనుకుంటే భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎకరానికి పది కోట్లు పరిహారం చెల్లించాలన్నారు. ఒకవేళ ఐదు కోట్లు చొప్పున చెల్లించినా లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చంద్రబాబు అన్నారు. మరి ప్రభుత్వం వద్ద లక్షా యాభై వేల కోట్లు డబ్బులు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

​అన్నింటికీ సిద్ధమేనా?

ఇప్పటికే ఎకరా పది కోట్లు ధర పలుకుతున్న భూములకు ఐదు కోట్ల రూపాయల చొప్పున చెల్లించినా లక్షా యాభై వేల కోట్ల రూపాయల సంపద పోతుందన్నారు చంద్రబాబు. అలాగే మరో లక్షా యాభై వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని వ్యాఖ్యానించారు. వాటన్నింటికీ సిద్ధంగా ఉన్నారా? అంటూ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.

​జగనబ్బ సొమ్మా?

అమరావతి నుంచి రాజధాని తరలిస్తే రూ.1.5 లక్షల కోట్లు ఆర్థిక భారంతో పాటు, మరో రూ.1.5 లక్షల కోట్ల సంపద నష్టపోతామని చంద్రబాబు అన్నారు. అదంతా ఎవడబ్బ సొమ్మని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారుజగనబ్బ సొమ్మా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా ప్రజల సొమ్మని ఆయన వ్యాఖ్యానించారు. పన్నులు కడుతున్న ప్రజలు అవన్నీ ఆలోచించాలని చంద్రబాబు అన్నారు.

​విశాఖ ప్రజల్లో భయం..

విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు అంశంపైనా చంద్రబాబు ఘాటుగా స్పందించారు. రాజధాని కావాలని విశాఖపట్నం ప్రజలు అడిగారా? అని బాబు ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉండే విశాఖ ప్రజలు భయపడుతున్నారని.. పులివెందుల రౌడీలు వస్తే ఏమవుతుందోనని భయాందోళనకు గురవుతున్నారని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. విశాఖపట్నం వద్దంటున్న పరిస్థితి ఉందని ఆయన అన్నారు.

​బాంబులు కూడా వేస్తారు..

విశాఖపట్నంపై వైసీపీ నేతలు స్కెచ్ వేశారని చంద్రబాబు ఆరోపించారు. విశాఖపట్నంలో ఏమీ మిగలదని.. భూములన్నీ కొట్టేస్తారని తీవ్ర విమర్శలు చేశారు. చెప్పిన ధరకే భూములు రాసిమ్మంటారని.. ఇవ్వకపోతే బతకవని చెప్పి బెదిరిస్తారన్నారు. అవసరమైతే బాంబులు కూడా వేస్తారని చంద్రబాబు ఘాటుగా విమర్శలు చేశారు. అన్యాయాలను ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.