యాప్నగరం

జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయ్.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

TDP: జమిలీ ఎన్నికలపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 2 Oct 2020, 11:12 pm
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మరో బాంబు పేల్చారు. 2022లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2022లో జమిలీ ఎన్నికలు వస్తే అందరూ సిద్ధంగా ఉండాలని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అమలాపురం పార్లమెంట్ నేతలతో చంద్రబాబు శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Samayam Telugu జమిలి ఎన్నికలపై చంద్రబాబు


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ చేతగాని పాలనతో చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. పులివెందుల రాజ్యాంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా జగన్ అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులపైనే జగన్ వర్గం ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తోందన్నారు. కేసుల మాఫీ కోసం జగన్ కేంద్రం కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అడగకుండా రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు.

అలాగే అమరావతిలో రూ. లక్ష కోట్ల విలువైన సంపదను సీఎం జగన్ విధ్వంసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్ పెడితే.. జగన్ కుట్ర పూరితంగా బీసీల్లో చీలిక తెచ్చారన్నారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వబోమని జగన్‌ చెబుతున్నారని మండిపడ్డారు. 2022లోనే జమిలీ ఎన్నికలు వచ్చే చాన్స్ ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, ఇప్పుడు తమ కార్యకర్తలను ఇబ్బందు పెట్టిన వారికి భవిష్యత్‌లో గుణపాఠం చెబుతామని చంద్రబాబు హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.