యాప్నగరం

సేమ్ టు సేమ్ అదే డిమాండ్.. జగన్ బాటలో చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా సొంత బాబాయి కేసు తేల్చలేకపోయారంటూ ఘాటు విమర్శలు చేశారు.

Samayam Telugu 4 Dec 2019, 7:48 pm
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. వైసీపీ కార్యకర్తలు టెర్రరిస్టుల కన్న ఘోరంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు.. మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Samayam Telugu 10VJPG7-NCHANDRABABUNAIDU


అమరావతి కాన్సెప్ట్‌ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చంపేసిందని ఆవేదన చెందారు. రాష్ట్రంలో కృతిమ ఇసుక కొరతను సృష్టించి భవన నిర్మాణ రంగాన్ని నాశనం చేసిన ఘనత జగన్‌దేనని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. తిరుమల డిక్లరేషన్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్యమతస్తులు ఎవరు వెళ్లినా తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, సోనియా గాంధీ వంటి వారే ఆచరించారని చంద్రబాబు చెప్పారు.

Also Read: పవన్ ‘బీజేపీ’ వ్యాఖ్యల్లో తప్పేముంది.. మాకూ శత్రుత్వం లేదు.. మాజీ మంత్రి వ్యాఖ్యలు

ప్రభుత్వ కార్యాలయాలు.. పాఠశాలలు.. శ్మశానాలనూ వదలకుండా వైసీపీ రంగులు వేస్తున్నారని.. ఈ ప్రభుత్వానికి కలర్స్ పిచ్చి పట్టుకుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగులు వేసేందుకు ఏకంగా రూ. 1,400 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వాలనే వాలంటీర్ పోస్టులను సృష్టించారని ఆరోపించారు. వారి వల్ల ప్రయోజనం లేకపోగా అరాచకాలు పెరిగి పోతున్నాయని విమర్శలు చేశారు చంద్రబాబు.

ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకా హత్య కేసుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. అబ్బాయి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా సొంత బాబాయి కేసు తేల్చలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. మరో డిమాండ్ ప్రభుత్వం ముందుంచారు బాబు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తేనే అసలైన దోషులు బయటకు వస్తారని.. తక్షణమే ఆ కేసును సీబీఐకి అప్పగించాలని చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ విషయమేంటంటే అది జగన్ పాత డిమాండ్ కావడం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్.. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

Read Also: మహిళల రక్షణకు ప్రత్యేక చట్టం.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.