యాప్నగరం

‘YS Jagan: ఎస్ఈసీ కనగరాజ్‌ను క్వారంటైన్‌‌లో పెడతారా, లేదా?’

చెన్నై నుంచి వచ్చిన ఎస్ఈసీ కగనరాజ్‌ను క్వారంటైన్‌లో ఎందుకు ఉంచలేదని వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ ప్రశ్నించారు.

Samayam Telugu 12 Apr 2020, 2:40 pm
రాష్ట్రంలో కరోనా వైరస్ (కోవిడ్ 19) నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రాష్ట్రానికి వస్తే క్వారంటైన్‌లో ఉంచుతామని చెబుతున్నారని, అయితే రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌ (ఎస్ఈసీ)గా నియమితులైన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ చెన్నై నుంచి వచ్చారని, ఆయనకు క్వారంటైన్‌ అక్కర్లేదా అని ప్రశ్నించారు.
Samayam Telugu pjimage - 2020-04-12T143412.210


రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కనగరాజ్‌ నియామకం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై హైకోర్టు మెట్టికాయలు వేస్తున్నా జగన్ సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఎస్ఈసీగా ఎవరిని నియమించినా అది ప్రభుత్వ ఇష్టమని, కానీ కనగరాజ్ నియామకం వ్యవహారంలో జగన్ సర్కారు తీరు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని చెప్పారు.
కరోనా వైరస్ వ్యవహారంలో సీఎం, మంత్రుల వ్యవహార సరళి వింతగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ నేతలు.. వలంటీర్లతో ప్రచారం చేయిస్తున్నారని ఆలపాటి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల అధికారిగా జస్టిస్‌ కనగరాజ్‌ శనివారం ఉదయం విజయవాడలో బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.