యాప్నగరం

కందుకూరు, గుంటూరు ఘటనలపై సీబీఐ విచారణ జరపాలి.. టీడీపీ నేత బోండా ఉమా డిమాండ్

కందుకూరు, గుంటూరు దుర్ఘటనలపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బోండా ఉమా మీడియాతో మాట్లాడారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 5 Jan 2023, 4:08 pm
నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులో తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల్లో తొక్కిసలాట ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. పోలీసుల వైఫల్యమే కందుకూరు, గుంటూరులో తొక్కిసలాటకు కారణమని.. ఆ రెండు ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులపై వేధింపుల తీవ్రత పెరుగుతోందని.. చంద్రబాబు సభలు, సమావేశాలకు వచ్చే జనాలను చూసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలయ్యిందన్నారు.
Samayam Telugu బోండా ఉమామహేశ్వరరావు (ఫైల్ ఫొటో)


వైఎస్ జగన్ ఓ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని.. చంద్రబాబు సభలకు తండోపతండాలుగా జనం వస్తున్నారంటే జగన్ పని అయిపోయినట్లేనని బోండా ఉమా జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జీవో నంబర్ 1 ద్వారా సీఎం జగన్ అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని చెప్పారు. 1981లో బ్రిటిష్ పాలనకు బూజులు దులిపి.. నేడు ప్రతిపక్షాల గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయకుండా అరాచక సృష్టించారన్నారు. పోలీసులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు డిసైడ్ చేస్తారట అని సీఎం జగన్‌పై బోండా ఉమా భగ్గుమన్నారు. ఆనాడే ప్రజాస్వామ్యాన్ని, విలువలను తుంగలో తొక్కే బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర్యం సాధించామని.. కానీ, ఇప్పుడు జగన్ ఆ చట్టాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఫెయిల్యూర్ సీఎం అని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారని ఆరోపించారు.

రానున్న రోజుల్లో తాలిబన్ చట్టాలను సైతం జగన్ అమలు చేసే అవకాశం ఉందని బోండా ఉమా పేర్కొన్నారు. జగన్ అరాచకాలను అడ్డుకునేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేశామని.. చరిత్రలో నియంతలు మనుగడ సాగించలేరని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కుప్పంలో మాజీ సీఎం ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటన చేయడం తప్పా అని ప్రశ్నల వర్షం కురిపించారు. నీకు ఒక రోజు ఉంటుందని తెలుసుకో జగన్ అంటూ హెచ్చరించారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.