యాప్నగరం

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా

తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల సెగ తగులుతోంది. గవర్నర్ నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా చేశారు.

Samayam Telugu 31 Jul 2020, 8:56 pm
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయడంపై తెలుగు దేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లుల ఆమోదానికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్‌ రవి) తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు.
Samayam Telugu బీటెక్ రవి


శుక్రవారం సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులపై గవర్నర్ సంతకం చేయడం అప్రజాస్వామిక చర్య అని చంద్రబాబుకు పంపిన లేఖలో బీటెక్ రవి పేర్కొన్నారు. రాజ్యంగ వ్యవస్థ అయిన శాసనమండలిలో బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపినా, అదే బిల్లులు తిరిగి మండలిలో పెట్టే ప్రయత్నం చేసినా మండలి ఆమోదించలేదని, అలాంటి బిల్లులను నేడు గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగ వ్యతిరేక చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు.

నాడు విభజన సమయంలో పార్లమెంటులో చేసిన చట్టంలోని అంశాలు నేటికీ మన రాష్ట్రానికి దక్కడం లేదని, నేడు చట్టసభ అయిన మండలికి దక్కిన ప్రాధాన్యానికి కలత చెంది ఇంత ప్రాధాన్యత లేని చట్టసభల్లో ఉంచటం అనవసరమని భావించి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తానని, మండలి చైర్మన్ గారికి సంబంధిత ఫార్మాట్‌లో రాజీనామా పంపుతానని వెల్లడించారు.

మరోవైపు, మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంపై అమరావతి జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గవర్నర్‌ తీరుకు నిరసనగా తుళ్లూరులో రైతులు ధర్నాకు దిగారు. గవర్నర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.