యాప్నగరం

‘ప్రజాభిప్రాయంతోనే నిర్ణయించారు.. రాజధాని మారిస్తే ఊరుకోం’

జగన్ ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని దెబ్బతీసిందని.. పోలవరం, అమరావతి నిర్మాణాలను నిలిపేయడంతో వాటిపై ఆధారపడిన అనేక మంది పనులు కోల్పోయి రోడ్డునపడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది.

Samayam Telugu 30 Aug 2019, 11:05 am
రాజధానిపై మంత్రి బొత్స సత్యానారాయణ వ్యాఖ్యలతో పెనుదుమారమే రేగుతోంది. రాజధానిని తరలించే దురుద్దేశంతోనే మంత్రి నోటి ద్వారా సీఎం జగన్ చెప్పిస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజధానిని దొనకొండకు తరలిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు సైతం రాజధానిపై పోరుకు సిద్ధమవుతున్నాయి. వివిధ పార్టీల నేతలు రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ దీనిని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జగన్ సర్కారుపై సెప్టెంబరు 3 నుంచి ప్రత్యేక కార్యాచరణతో పోరును ఉధృతం చేయాలని టీడీపీ అధినేత నిర్ణయించారు.
Samayam Telugu avinash


కాగా, అమరావతిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని ప్రజాభిప్రాయంతోనే నిర్ణయించారని అన్నారు. అమరావతి కోసం 25వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, రాజధానిని మార్చాలని చూస్తే ఊరుకునేది లేదని అవినాష్‌ హెచ్చరించారు. అమరావతిలో ఇప్పటి వరకు జరిగిన పనులను తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. మందడంలో విలేకరులతో మాట్లాడిన ఆయన పలువురు రైతులతో చర్చించారు. సేవ్‌ అమరావతి పేరుతో పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని శ్రావణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం రాష్ట్ర రాజధానిగా అమరావతినే ఉంచాలని డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి మాట్లాడుతూ.. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. హైకోర్టు బెంచ్‌లను అమరావతి, విశాఖల్లో ఏర్పాటు చేయాలని సూచించిన తులసిరెడ్డి.. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పలు భవనాల దశలను ఆయన వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.