యాప్నగరం

‘కేసీఆర్‌తో జగన్ నాలుగు సార్లు భేటీ.. దేని గురించి చర్చించారు?’

కేసీఆర్, జగన్ సమావేశంలో జల వనరులు, ఇతర అంశాలతోపాటు గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు ప్రధానంగా చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపైనా చర్చించారు.

Samayam Telugu 14 Oct 2019, 8:58 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పలుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఏపీ, తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరి వరద జలాల మళ్లింపు, విభజన సమస్యలు సహా పలు అంశాలపై చర్చించారు. గోదావరి జలాలను శ్రీశైలానికి మళ్లించి ఇరు రాష్ట్రాలూ వినియోగించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే, నదీ జలాల పర్యవేక్షణకు ఏర్పాటుచేసిన అపెక్స్ కౌన్సిల్‌లోని పెండింగ్ అంశాలపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు చర్చించలేదని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.
Samayam Telugu KCR


జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం నదీ జలాల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన అపెక్స్‌ కౌన్సిల్‌లో అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై సీఎం ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. జగన్‌, కేసీఆర్ నాలుగు సార్లు భేటీ అయ్యారని, ఈ సందర్భంగా ఏయే అంశాలపై చర్చించారో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బచావత్‌ ట్రైబ్యునల్‌, నదీ జలాల పంపిణీపై ఒక్కసారైనా జగన్ చర్చించారా? అని దేవినేని ఉమ నిలదీశారు. ఎన్నికల్లో కేసీఆర్‌ చేసిన సాయానికి జగన్ రుణం తీర్చుకుంటున్నారని దీనికి బదులుగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. విద్యుత్తు ఉద్యోగులను ఏపీకి పంపిస్తే నోరు మెదపడంలేదని, రూ.5వేల కోట్ల విద్యుత్తు బకాయిలను తెలంగాణ చెల్లించకపోయినా వదిలేశారని దేవినేని ఆరోపించారు. కేసీఆర్‌, కవితలు పోలవరంపై కేసు వేస్తే జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. సముద్రంలోకి లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా వెళుతున్నా, రాయలసీమకు వాటిని తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.