యాప్నగరం

సొంత బాబాయ్‌ని చంపినవారిని కనిపెట్టలేని సీఎం జగన్.. ప్రజలనేం ఉద్ధరిస్తారు: జలీల్ ఖాన్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకుడు జలీల్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు విజయవాడలో జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 3 Oct 2022, 4:14 pm
Samayam Telugu జలీల్ ఖాన్ (ఫైల్ ఫొటో)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పచ్చి అబద్ధాలాడి, ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని జీరో చేశారని విమర్శించారు. ఈ మేరకు సోమవారం విజయవాడలో జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను నెరవేర్చానని అంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. దానిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని ప్రశ్నించారు.

సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని కనిపెట్టలేని వ్యక్తి.. ప్రజల్ని ఉద్ధరిస్తారా? అని జలీల్ ఖాన్ నిలదీశారు. పథకాలు, అభివృద్ధికి నిధుల సమస్య లేదంటున్న ముఖ్యమంత్రి జగన్.. ఎవరికీ చెప్పకుండా డబ్బులు ఇడుపులపాయలో దాచేస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. గడపగడపకు వెళ్తున్న అధికార పార్టీ వారిపై ప్రజలు ఉమ్మేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, ఆయన కుటుంబానికి రాజకీయ ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పార్టీకే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని జలీల్ ఖాన్ విమర్శించారు. ఇక, రేషన్ పంపిణీ పేరుతో కేవలం బియ్యం మాత్రమే ఇస్తే ప్రజలు సంతోషంగా పండుగ చేసుకోగలరా అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు. మూడున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం రూ. 7 వేల కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించిందని ఆరోపించారు. టీడీపీ హాయాంలో రూ. 47 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తే.. జగన్ వాటిని 40 లక్షలకు తగ్గించారన్నారు. కోర్టుల ద్వారా జగన్మోహన్ రెడ్డికి పడినన్ని చీవాట్లు దేశంలో మరే ముఖ్యమంత్రికి పడలేదని ఎద్దేవా చేశారు. ఇక, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేని వారు, మూడు రాజధానులను నిర్మిస్తారా? అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.