యాప్నగరం

సీఎం జగన్‌లో మొదలైన కలవరం.. అందుకే ఈ ప్రకటన: అచ్చెన్నాయుడు

విశాఖపట్నం రాజధాని కాబోతోందంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం జగన్ కామెంట్స్‌పై ప్రతిపక్ష పార్టీల నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా, అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 31 Jan 2023, 11:09 pm
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిపై మళ్లీ వివాదం రాజేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విశాఖపట్నం రాజధాని కాబోతోందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగమేనని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అమరావతే రాజధాని అని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందన్న అచ్చెన్న.. సీఎం జగన్‌ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని చెప్పారు.
Samayam Telugu అచ్చెన్నాయుడు (ఫైల్ ఫొటో)


సొంత బాబాయ్‌ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం కావడం, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించడంతో.. సీఎం జగన్మోహన్ రెడ్డిలో కలవరం మొదలైందని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అందుకే పథకం ప్రకారం ‘ఏపీ రాజధాని విశాఖపట్నం’ అని వ్యాఖ్యలు చేసి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించారని తెలిపారు.

మరోవైపు వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతోనే హడావుడిగా సీఎం జగన్‌ విశాఖ రాజధాని ప్రకటన చేశారని టీడీపీ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి.. సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారన్న అంశం కీలకంగా మారిందన్నారు. ఆ కాల్ డేటా వివరా‌లు వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఆరోపించారు.

మరోవైపు సీఎం వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నేత సత్యకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. నాలుగేళ్ల పాలనలో సీఎం జగన్ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలన్నారు. సీబీఐ విచారణ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం జగన్‌ రాజధానిపై వ్యాఖ్యలు చేశారన్నారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.