యాప్నగరం

వైజాగ్ సాయినార్ ఫార్మా ప్రమాదంపై నారా లోకేశ్ దిగ్భ్రాంతి

వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ఘటనతో విశాఖపట్నం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మే నెలలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం నుంచి ఆ ప్రాంతవాసులు ఇంకా కోలుకోకముందే మరో ప్రమాదం జరిగింది.

Samayam Telugu 30 Jun 2020, 8:31 am
పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజ్ దుర్ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరవక ముందే మరో ఘటన జరగటం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ సంఘటనలో మృతి చెందిన ఇద్దరి పట్ల నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు. గ్యాస్ లీకేజ్ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని లోకేశ్ కోరారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే సహాయ చర్యలు చేపట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.
Samayam Telugu విశాఖ ప్రమాదంపై లోకేశ్ విచారం
Nara Lokesh on Vizag Incident


మృతులను షిఫ్ట్ ఇంఛార్జ్ నరేంద్ర, కెమిస్ట్ గౌరీ శంకర్‌గా గుర్తించారు. నరేందర్ గుంటూరు జిల్లా తెనాలికి చెందినవాడు కాగా.. గౌరీ శంకర్ విజయనగరం వాసి. గ్యాస్ లీకేజ్‌కు కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు.

గత నెలలో వెంకటాపురం వద్ద ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరీన్ విష వాయువు లీకేజీ ఘటనలో 12 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 500 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్స్‌లో చేరారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఇంకా కోలుకోలేదు. ఈ ప్రమాదం భోపాల్ విషవాయువు ఘటనను తలపించింది.

ఎల్జీ పాలిమర్స్‌ సంస్థలో పలు నిర్వహణా లోపాలున్నాయని, అదే ప్రమాదానికి కారణమైందని శేషశయనా రెడ్డి నివేదిక వెల్లడించింది. స్టైరిస్‌ ఆవిరి లీక్‌ కావడానికి ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ ఎండీ, అక్కడ పనిచేసే వివిధ విభాగాల ఉద్యోగులే బాధ్యులని నివేదికలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.