యాప్నగరం

Palnadu:ఎవ్వర్నీ వదలను.. మాజీ ఎమ్మెల్యే తీవ్ర హెచ్చరికలు

వైఎస్సార్సీపీ బాధితులుగా పేర్కొంటున్న గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని జంగమేశ్వరపాడు, పిన్నెల్లి గ్రామాల చెందిన 210 మంది టీడీపీ కార్యకర్తలకు గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నష్టపరిహారం పంపిణీ చేశారు.

Samayam Telugu 19 Nov 2019, 8:01 pm
జగన్ సర్కార్‌పై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఒక్క అవకాశమని బతిమిలాడుకున్న వైఎస్సార్సీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పల్నాడు బాధితులకు ఆర్థిక సాయం కార్యక్రమంలో తాజా మాజీలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యకర్తలు, నేతలతో సహా తమ మాటవినని వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. బహిరంగ దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. టీడీపీ నేతలు యరపతినేని, చింతమనేనిపై ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు.
Samayam Telugu yarapatineni


సీఎం జగన్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. పాలకులు ఎప్పుడు జైలుకెళ్తారో వారికే తెలియని పరిస్థితులు ఉన్నాయని ఎద్దేశా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరిపోయే దీపమన్నారు. టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని.. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

అధికారం కొత్తకాబట్టే ఆ పార్టీ నేతల్లో అహంకారం ఎక్కువైందని తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వాన్ని నడపలేరని చురకలంటించారు. పల్నాడు ప్రాంత కార్యకర్తలను, నాయకులను వేధిస్తున్న వారందరి జాతకాలు తమ దగ్గరున్నాయని, ఎవరినీ వదిలేది లేదని ఆయన హెచ్చరించారు.

Also Read: అక్రమ సంబంధం: భార్యను కిరాతకంగా చంపేశాడు.. దర్జాగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి..

ఒకే ఒక్క చాన్స్.. ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజల కాళ్లావేళ్లాపడి బతిమిలాడిన వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని ప్రజలెవరూ ఊహించలేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు విమర్శించారు. ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఘటనను గుర్తు చేశారు. కేసులు పెట్టి వేధించడం వల్లే ఆయన చనిపోయారన్నారు. టీడీపీ కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని.. అదిలేకపోబట్టే కోడెల వంటి నాయకుడిని కోల్పోయామని అశోక్‌బాబు చెప్పారు.

మరో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో దోపిడీయే సాగుతుందని.. మచ్చుకైనా అభివృద్ధి కనిపించడంలేదని విమర్శించారు. అధికార అహంకారంతో తప్పుడు కేసులతో వేధిస్తున్నారని.. దెబ్బకు దెబ్బ తీస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు అధైర్యపడకుండా స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలని కోరారు. పల్నాడులో వైఎస్సార్సీపీ దాష్టీకాలపై చంద్రబాబు పోరాటం చేశాకే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు.

Read Also: మందుబాబులకు ఇక మోతే.. జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.