యాప్నగరం

రాజధానిపై మబ్బులు వీడతాయ్.. టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రాక్టర్ డ్రైవర్లపై దాడులు చేసి ఇసుక ఎత్తుకుపోతున్నారు. అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన సచివాలయం నుంచే పాలన చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

Samayam Telugu 30 Oct 2019, 5:15 pm
రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి పందికొక్కుల్లా తినేస్తున్నారని జగన్ సర్కార్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటు విమర్శలు చేశారు. ఇసుకని తింటూ, భవన నిర్మాణ కార్మికులని మింగేస్తున్న వారు కూడా నీతులు మాట్లాడుతున్నారంటూ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను అందరూ గమనిస్తున్నారని, ఎవరూ గమనించడం లేదని భ్రమ పడుతున్నారన్నారు.
Samayam Telugu Amaravati-750x313-1-666x400


ఇసుక కొరత లేదని ట్విటర్‌లో చెప్పడం కాదని, దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి చెప్పాలని బుద్దా సవాల్ చేశారు. ఇసుక కొరత లేకుంటే మీ మేధావి సీఎం జగన్ వారోత్సవాలు ఎందుకు చేస్తున్నారని బుద్దా ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఇసుక మాఫియా రెచ్చిపోతోందన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లపై దాడులు చేసి ఇసుక ఎత్తుకుపోతున్నారని.. అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడడం లేదని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

Also Read: ‘బాబుది క్రిమినల్ మైండ్.. అందుకే పవన్ కళ్యాణ్‌తో..’

అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజలు ఛీ కొట్టడాన్ని భరించలేక సీఎం జగన్‌కి మతిస్థిమితం తప్పి మెదడు మోకాల్లోకి జారిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరతతో కుటుంబాలను పోషించుకోలేక కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రం అట్టుడుకుతుంటే ముఖ్యమంత్రి ఫిడేలు వాయించుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. సిగ్గే సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి ఈ-ఐ కేంద్రాల్లో ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారని బుద్దా అన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కంటి వెలుగు పథకంలో పరీక్షలు చేయించుకోవాల్సింది విజయసాయి రెడ్డి ఒక్కరేనని సెటైర్లు వేశారు. చత్వారం రావడం వల్లే అమరావతిలో నిర్మాణాలు కళ్లకు కనపడటం లేదని విమర్శించారు. వయసు కూడా పెరుగుతోంది కదా అంటూ ఎద్దేవా చేశారు.

అమరావతి గ్రాఫిక్స్ అని చేస్తున్న విమర్శలపైనా బుద్దా స్పందించారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన సచివాలయం నుంచే పాలన చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. హైకోర్టు కూడా గ్రాఫిక్ అంటున్నారు.. త్వరలో వెళ్తారుగా అప్పుడు మీకు మబ్బులు వీడడం ఖాయమని ఎద్దేవా చేశారు. అధికారం వచ్చిన కేవలం 5 నెలల్లో అమరావతిని ఎడారి చేసిన సిగ్గులేని జన్మ అంటూ మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.