ఢిల్లీకి చేరిన గుడివాడ క్యాసినో రచ్చ.. ఈడీకి ఫిర్యాదు చేసిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రచ్చ రేపిన గుడివాడ క్యాసినో వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహించారంటూ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేసింది టీడీపీ. కొన్ని రోజులు స్తబ్దుగా ఉన్న వివాదం.. మళ్లీ ఇప్పుడు మరోమారు తెరమీదకు వచ్చింది.
Samayam Telugu 8 Feb 2022, 2:42 pm
ప్రధానాంశాలు:
- ఢిల్లీకి చేరిన గుడివాడ క్యాసినో వ్యవహారం.. ఈడీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు
- ఈడీని కలిసిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర
- అన్నీ ఆధారాలు సమర్పించామంటున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రచ్చ రేపిన గుడివాడ క్యాసినో వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహించారంటూ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేసింది టీడీపీ. కొన్ని రోజుల పాటు అటు అధికార వైఎస్సార్సీపీ.. ఇటు ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధమే కొనసాగింది. ఈ వ్యవహారంలో మాటలు శృతిమించడంతో బుద్ధా వెంకన్న పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. ఆ తర్వాత కొన్ని రోజులు స్తబ్దుగా ఉన్న వివాదం.. మళ్లీ ఇప్పుడు మరోమారు తెరమీదకు వచ్చింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ కలిసి ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి గుడివాడ క్యాసినో వ్యవహారం తీసుకెళ్లారు. ఈ విషయంలో ఈడీ దర్యాప్తు చేపట్టాలంటూ ఫిర్యాదు చేశారు. సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు కృష్ణ జిల్లా గుడివాడలో క్యాసినో నిర్వహించారని.. దాదాపు రూ.500 కోట్ల వరకు చేతులు మారాయంటూ ఈడీకి వివరించారు. ఈడీ తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం తమకు ఉందని.. క్యాసినో జరిగిందని చెప్పేందుకు అవసరమైన అన్ని ఆధారాలు ఈడీకి సమర్పించామని ఎంపీ రామ్మోహన్ నాయుడు మీడియాకు వివరించారు.