యాప్నగరం

ఆ బీభత్సాన్ని చూసేందుకు వెళ్తూ, సీఎం జగన్ నవ్వులు.. ఎంత నవ్వులాటో చూడండి: BJP

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ సంచలన కామెంట్స్ చేశారు.

Samayam Telugu 7 Dec 2021, 6:01 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వరదల భీభత్సం జరిగితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేల్ వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో ప్రకృతి విలయంతో కంటే, మానవ తప్పిదంతో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టమే ఎక్కువ ఉన్నదని రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర అధికారుల బృందం తెలిపిందని వెల్లడించారు.
Samayam Telugu సీఎం జగన్ (ఫైల్ ఫొటో)


విపత్తుల విధ్వంసం ఎంత భయానకంగా ఉంటుందో జగన్ సర్కార్ అంచనా వేయలేకపోయిందని సత్యకుమార్ ఆరోపించారు.. అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోయే ప్రమాదం పొంచి ఉందని మీడియా ముందుగా చెప్పినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం సీరియస్‌గా తీసుకోలేదన్నారు. వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయని విపత్తు నిర్వహణ శాఖ ఇచ్చిన నివేదిక స్పష్టం చేసినప్పటికీ, రాష్ట్రం చేతులు ముడుచుకుని కూర్చుందని ఆరోపించారు.

పైగా, కడప బీభత్సాన్ని ప్రత్యేక విమానంలో చూడడానికి వెళ్తూ, ముఖ్యమంత్రి జగన్ తన అనుయాయులతో నవ్వుతూ సెల్ఫీలు దిగడం చూస్తే ప్రజల బాధలంటే ఆయనకెంత నవ్వులాటగా ఉన్నదో అర్థమవుతోందని సత్యకుమార్ విమర్శించారు. ఆనకట్ట తెగిపోయి గ్రామాలు కొట్టుకుపోయిన విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెఖావత్ పార్లమెంట్‌లో ప్రకటించి జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని జాతీయ స్థాయిలో బహిర్గతం చేశారని పేర్కొన్నారు.

తమ తప్పు ఒప్పుకునే బదులు వైసీపీ మంత్రులు కొందరు కేంద్రమంత్రిపైనే దాడి చేయడం దురదృష్టకరమని సత్యకుమార్ అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నందుకే కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆనకట్టల భద్రతకు బిల్లును ప్రవేశపెట్టిందని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.