యాప్నగరం

దోమలపై దండయాత్ర అంటే ఎగతాళి చేశారు, మీరు చేస్తున్నదేంటి: చంద్రబాబు

YS Jagan: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికలు నిర్వహించాలని ఎలా అడుగుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

Samayam Telugu 17 Mar 2020, 12:35 am
కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సూచించారు. కరోనా వైరస్‌ పూర్తిగా లేదని ప్రకటించే వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో రాష్ట్రంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్న సమయంలో తాను దోమల దండయాత్ర అని ప్రకటిస్తే తనను ఎగతాళి చేశారని, దోమలపై యుద్ధం చేస్తారా? అని అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu BABU


ఇప్పుడు కరోనాకు పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డి అనడాన్ని జాతీయ మీడియా సైతం తప్పుబట్టిందని చంద్రబాబు చెప్పారు. కరోనా వైరస్‌ విషయంలో 4 వారాల పాటు ఎలాంటి సమస్య ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటున్నారని.. సీఎస్‌కు దీనిపై అవగాహన ఉందా? అని ప్రశ్నించారు.

సీఎం జగన్‌ తన మొండి వైఖరి, వితండవాదం వీడి 5 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించాలని చంద్రబాబు సూచించారు. కరోనా వైరస్‌ ప్రభావంపై రాబోయే రెండు మూడు వారాలు చాలా కీలకమని చెప్పారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందితే అదుపుచేయడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. మహారాష్ట్ర, బెంగాల్‌లో అన్ని రకాల ఎన్నికలను రద్దు చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. కానీ, జగన్ మాత్రం స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ఇంకా ఎలా ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు. గెలిచాం అనిపించుకోవాలనే తపన తప్ప ప్రజల ప్రాణాలంటే సీఎంకు లెక్కలేదన్నారు.

ఎన్నికలు రెండు నెలలు వాయిదా వేస్తే ఏమవుతుందని నిలదీశారు. రాష్ట్రంలోకి 6,777 మంది విదేశీయులు వచ్చారని, వారి చిరునామాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లాకు 900 మంది ఎన్నారైలు వచ్చారని తెలుస్తోందని, వీటన్నింటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.