యాప్నగరం

‘ఒకే రోజులో ఇసుక సమస్యకు పరిష్కారం.. ఎలాగంటే?’

తెలుగుదేశం హయాంలో రూ.10 వేలకే లారీ ఇసుక దొరికితే.. వైఎస్సార్సీపీ అత్యుత్తమ ఇసుక పాలసీతో రూ.40 వేలకు చేరింది. ఇసుక మాఫియాను పెంచి పోషిస్తూ ఆ మాఫియాను ఉచితంగా ఇసుక ఇచ్చిన టీడీపీకి అంటగడుతున్నారని జగన్ సర్కార్‌పై మాజీ మంత్రి కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు.

Samayam Telugu 2 Nov 2019, 7:05 pm
జగన్ సర్కార్ నిరంకుశత్వం కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. సీఎం జగన్ తీరు నీరో చక్రవర్తిని మరపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాతో కోట్లు బొక్కి.. కూలీల ఆకలిని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. అత్యుత్యమ పాలన అని చెప్పి దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం హయాంలో రూ.10 వేలకే లారీ ఇసుక దొరికితే.. వైఎస్సార్సీపీ అత్యుత్తమ ఇసుక పాలసీతో రూ.40 వేలకు చేరిందని ఎద్దేవా చేశారు.
Samayam Telugu Sand_Mining_EPS


Also Read: పవన్‌కు ఝలక్.. లాంగ్‌మార్చ్‌కి రాలేమన్న ఎర్రసైన్యం

వరదలను సాకుగా చూపి మంత్రులు, ఎమ్మెల్యేలు బ్లాక్‌లో లారీ ఇసుకను రూ.లక్షకు అమ్ముతున్నారని కళా ఆరోపించారు. లారీ ఇసుక రూ.10వేలకే ఇస్తే మాఫియా అన్నారని.. మరి లక్షకు అమ్మితే ఏమనాలని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టీడీపీ అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని తక్షణమే ప్రకటించాలన్నారు. అదే జరిగితే కేవలం ఒకే ఒక్క రోజులో ఇసుక కొరత తీరిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇసుక ధరలు తగ్గడంతోపాటు కూలీల ఆత్మహత్యలు కూడా ఆగిపోతాయన్నారు.

Read Also: అవి కూడా చేయలేనప్పడు ఎందుకీ బతుకు.. ఆవేదనతో ఓ కార్మికుడి ఆత్మహత్య

రాష్ట్రంలోని 30 లక్షల మంది కార్మికుల భవిష్యత్తు కోసం ఇసుక కొరతపై ఆందోళన చేస్తే ఉలికిపాటు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించే వారిపై నీతిమాలిన కుతంత్రాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇసుక మాఫియాను పెంచి పోషిస్తూ ఆ మాఫియాను ఉచితంగా ఇసుక ఇచ్చిన టీడీపీకి అంటగడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011లో వచ్చిన వరదల కంటే ఇప్పుడొచ్చిన వరదలు పెద్దవవేమీ కావని.. అప్పుడు రాని కొరత ఇప్పుడు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.