యాప్నగరం

‘బాధ్యత లేని సీఎం జగన్‌.. కరోనాపై ప్రపంచం వణుకుతుంటే జ్వరంతో పోలుస్తారా..’

YS Jagan: కరోనా వైరస్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యత లేకుండా మాట్లాడారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Samayam Telugu 1 Apr 2020, 8:50 pm
కరోనా వైరస్‌ (కోవిడ్ 19)పై ప్రపంచమంతా వణికిపోతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఏ మాత్రం బాధ్యత లేకుండా సాధారణ విషయంలా మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. బుధవారం సీఎం జగన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధ్యత లేకుండా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా జ్వరం లాంటిదని, భయం అవసరం లేదని ఎలా అంటారని ఆయన నిలదీశారు. దీన్నిబట్టి చూస్తే ప్రజల ఆరోగ్యం పట్ల సీఎం జగన్‌కు ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu 1


భవిష్యత్తు సమస్యలను ఎదుర్కోవడంపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టకుండా మొక్కుబడిగా మీడియా సమావేశం నిర్వహించారని సీఎం జగన్‌పై యనమల విమర్శించారు. రాష్ట్ర ఆదాయం మందగిస్తోందని సీఎం చెప్పారని.. ఈ విషయంలో చేపట్టబోయే చర్యలను ఎందుకు వివరించలేదని తప్పుబట్టారు.

దీనిపై నిపుణుల సలహాలు కూడా సీఎం జగన్ తీసుకోలేదని యనమల విమర్శించారు. కరోనాను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ మీడియా సమావేశం పెడితే ప్రశ్నలు వేసే అవకాశం ఎందుకు ఇవ్వలేదని యనమల ప్రశ్నించారు. వాస్తవాలు దాచిపెట్టి తప్పించుకోవాలని చూస్తే కరోనా వైరస్‌ కంటే ఎక్కువ ప్రమాదం జరుగుతుందన్న విషయాన్ని జగన్‌ గ్రహించాలని ఆయన హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.