యాప్నగరం

మూడు రాజధానులతో ముసలం.. జగన్ పద్మవ్యూహంలో విపక్షాలు.. బయటపడేనా?

జగన్ సర్కార్ వ్యూహంతో ఒకే దెబ్బకు విపక్షాలన్నింటినీ నిలువునా చీలిపోయే పరిస్థితి దాపురించింది. మూడు రాజధానులు సక్సెస్ అవుతాయో లేదో తెలియదు కానీ రాజకీయంగా మాత్రం జగన్ విజయం సాధించేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Samayam Telugu 13 Jan 2020, 10:35 pm
ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనలతో రాష్ట్రంలో అలజడి రేగిన విషయం తెలిసిందే. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని సాక్షాత్తూ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్.. కర్నూలులో జ్యుడీషియరీ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండొచ్చంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ వ్యాఖ్యలతో అమరావతి రైతులు భగ్గుమన్నారు. రాజధాని మార్చడమేంటని మండిపడుతున్నారు.
Samayam Telugu three capitals issue causes differences in opposition parties in andhra pradesh
మూడు రాజధానులతో ముసలం.. జగన్ పద్మవ్యూహంలో విపక్షాలు.. బయటపడేనా?


​రాజధాని మార్చడం లేదు..

రాజధాని మారుస్తామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నది వైసీపీ నేతల వాదన. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని.. కేవలం ఒక్క ప్రాంతానికే అభివృద్ధి పరిమితం కాకూడదని చెబుతున్నారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణే అజెండాగా ముందుకు సాగుతామని స్పష్టం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో అమరావతిలో అశాంతి రేగినా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో వ్యతిరేకత అంతగా కనిపించకపోవడం వైసీపీకి కలిసొచ్చే అంశంగా మారింది.

​కర్నూలులో స్వాగతం..

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రజలు, న్యాయవాదులు , విద్యార్థి సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యక్ష ఉద్యమాలు సైతం నడిచాయి. ఈ నేపథ్యంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై ఆ ప్రాంత ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. రాయలసీమకు చెందిన నేతలు పార్టీలకతీతంగా నేతలు కర్నూలులో హైకోర్టు ఏర్పాటును సమర్థించారు.

​విశాఖ నేతల హర్షం..

ఇక ఉత్తరాంధ్ర విషయానికొస్తే.. విశాఖటప్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు ప్రతిపాదనలతో ఆ ప్రాంత ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఎంతో వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి.. సీఎం జగన్‌కు ఆ ప్రాంత నేతలు మద్దతు తెలుపుతున్నారు. ఉత్తరాంధ్ర విపక్ష నేతలు సైతం జగన్ సర్కార్ ప్రతిపాదనలకు జై కొట్టడం విశేషం.

ఆత్మరక్షణలో విపక్షాలు.!

ఒక్క అమరావతిలో మినహా జగన్ సర్కార్ ప్రతిపాదనలపై అటు రాయలసీమ.. ఇటు ఉత్తరాంధ్రలోనూ వ్యతిరేకత కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడదే ప్రతిపక్ష పార్టీలను ఆత్మరక్షణలోకి నెట్టేస్తోంది. విపక్ష పార్టీల్లో ప్రాంతాలవారీగా చీలికలకు కారణమవుతోంది. ఒక ప్రాంతంలో కావాలని పట్టుబడితే మరో ప్రాంతం నేతలు విభేదించే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. దీంతో రాజధానిపై ఎటూ తేల్చుకోలేని సంకట స్థితిలో పడిపోయాయి విపక్షాలు.

​తమ్ముళ్ల తలోదారి..

రాయలసీమలో హైకోర్టు నిర్ణయానికి టీడీపీ నేతలు సైతం జైకొట్టారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును ఆ పార్టీ సీనియర్ నేత కేఈ క్రిష్ణమూర్తి సహా పలువురు నేతలు స్వాగతించారు. అధినేత అమరావతికి జై కొట్టినా.. తమ ప్రాంత ప్రయోజనాల రీత్యా స్వాగతిస్తున్నామని కుండబద్దలు కొట్టారు. అదే కోవలో విశాఖకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా పలువురు నేతలు సమావేశం ఏర్పాటు చేసుకుని మరీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు జైకొట్టారు. దీంతో చంద్రబాబు ఎటూ చెప్పలేక.. ఎవరి ప్రాంత ప్రయోజనాలనూ కాదనలేని సంకట స్థితిలో ఉండిపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

​బీజేపీలోనూ భిన్న స్వరాలు..

జాతీయ పార్టీ బీజేపీలోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి. కర్నూలులో హైకోర్టును రాయలసీమ ప్రాంత నేతలు స్వాగతిస్తున్నారు. బీజేపీలో కీలక నేతలుగా ఉన్న టీజీ వెంకటేష్, విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు ఒకడుగు ముందుకేసి రాజధాని కూడా కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా పలువురు నేతలు మాత్రం అమరావతే రాజధానిగా ఉండాలని తీర్మానం చేశారు. రాజధానితో కేంద్రానికి సంబంధం లేదంటున్న ఎంపీ జీవీఎల్‌‌తో విభేదించి మరీ అమరావతికి జైకొట్టడంతో పార్టీలో నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

​​కమ్యూనిస్టులూ అదే కోరుకుంటున్నారా.!

ఇప్పుడు ఆ సెగ కమ్యూనిస్టులను సైతం తాకింది. రాజధాని, అధికార వికేంద్రీకరణ విషయమై కర్నూలు సీపీఐలో విభేదాలు తలెత్తాయి. అమరావతి కోసం టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఉద్యమిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీరును కర్నూలు జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారు. అధికార వికేంద్రీకరణ జరగాలని జిల్లా కార్యవర్గం తీర్మానం కూడా చేసింది. అమరావతిని తాత్కాలిక రాజధానిగా మార్చింది చంద్రబాబేనని విమర్శలు గుప్పించింది.

​జగన్ సక్సెస్ అయినట్టేనా.?

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనలు ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకేనన్న విపక్షాల విమర్శలను పక్కనబెడితే.. అదే నిజమైందన్న వాదనలు ఉన్నాయి. జగన్ సర్కార్ వ్యూహంతో ఒకే దెబ్బకు విపక్షాలన్నింటినీ నిలువునా చీలిపోయే పరిస్థితి దాపురించింది. ఏ ఒక్క ప్రాంతానికీ ప్రాధాన్యం కల్పించాలని అడగలేని పరిస్థితి. అమరావతికి మద్దతు ఇస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీ దెబ్బతింటుందేమోనన్న ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టేశారు సీఎం జగన్. మూడు రాజధానులు సక్సెస్ అవుతాయో లేదో తెలియదు కానీ రాజకీయంగా మాత్రం జగన్ విజయం సాధించేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.