యాప్నగరం

సీఎం జగన్ రాజీనామా.. మార్మోగుతున్న సోషల్ మీడియా!

తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణమృదంగం మోగడం రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో సీఎం జగన్ రాజీనామా చేయాలంటూ ట్విట్టర్ మార్మోగిపోతోంది.

Samayam Telugu 11 May 2021, 2:52 pm
కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న తరుణంలో.. తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణమృదంగం మోగడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సరైన వైద్య సదుపాయాలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో కోవిడ్ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు అనుభవిస్తున్నారు. ఇలాంటి సమయంలో తిరుపతిలోని ఎస్‌వీఆర్ రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సకాలంలో అందకపోవడంతో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ కలచివేస్తోంది. ఈ తరుణంలో రుయా ఘటనకు జగన్ ప్రభుత్వ అసమర్థతే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Samayam Telugu జగన్ రాజీనామా చేయాలని ట్రెండింగ్


రుయా ఘటనకు బాధ్యత వహించి వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ రాజీనామా చేయాలంటూ ట్విట్టర్‌లో టీడీపీ, జనసేన కార్యకర్తలు, పలువురు నెటిజన్లు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ట్విట్టర్‌లో #ResignJagan హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. మంగళవారం మధ్యాహ్నం 2.25 గంటలకు 24.1 వేల ట్వీట్లు చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం.. రుయా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ వారంలో ఇటువంటి సంఘటనలు మరికొన్ని చోట్ల కూడా జరిగాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నాయకత్వ లోపం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తిరుపతి రుయాలో మరణ మృదంగం మోగిందని ఓ నెటిజన్ ఆరోపించారు. తనకు కన్నీళ్లు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇంత బాధ్యతారహితంగా ఎలా వ్యవహరించ గలుగుతోందని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని సమర్థించేవారిపై పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.