యాప్నగరం

పోలవరంలో అక్రమాలపై విజిలెన్స్.. రికార్డులకు గడువుకోరిన అధికారులు!

పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలను వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిపుణుల కమిటీతోపాటు మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

Samayam Telugu 25 Aug 2019, 9:36 am
పోలవరం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై నిగ్గుతేల్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిపుణుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు జరిగినట్టు ఈ కమిటీ వెల్లడించడంతో దీనిపై విచారణకు విజిలెన్సు శాఖ రంగంలోకి దిగింది. తమకు అవసరమైన రికార్డులను శనివారంలోగా అందజేయాలని పోలవరం ప్రాజెక్టు ఉన్నతాధికారులను రాజమండ్రి రీజినల్ విజిలెన్సు అధికారి కోరారు. దీంతో విజిలెన్స్ అధికారులను జలవనరులశాఖ అధికారులు శనివారం కలిసి మరికొంత సమయం కావాలని తెలిపారు. ఈ అంశంపై అవగాహన ఉన్న అధికారులను ఇందులో డిప్యూట్‌ చేయాలని పోలవరం ఎస్‌ఈకి రాసిన లేఖలో విజిలెన్స్ అధికారి కోరారు.
Samayam Telugu polavaram


పోలవరం పనుల్లో అక్రమాలు జరిగినట్టు నిపుణుల కమిటీ అభిప్రాయపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మరోవైపు మంత్రివర్గ ఉపసంఘం కూడా పోలవరంపై దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టులో ఏమైనా అవకతవకలు జరిగితే నిగ్గు తేల్చాలంటూ వారికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అవసరమైతే విజిలెన్స్, ఇతర విభాగాల సహకారం తీసుకోవచ్చని క్యాబినెట్ సబ్-కమిటీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ నివేదిక, క్యాబినెట్ సబ్-కమిటీలు పోలవరం ప్రధాన డ్యాంపై అధికారులతో మాట్లాడి సిద్ధం చేసిన నివేదికల ఆధారంగా విజిలెన్సు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

ముఖ్యంగా పోలవరం పనుల్లో 2011లో ట్రాన్స్‌ట్రాయ్‌తో కుదిరిన ఒప్పందం మేరకు ధరలు చెల్లించాల్సి ఉండగా, 2015-16 ధరలు వర్తింపజేయడం, ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వమే కాంట్రాక్టర్ తరఫున చెల్లింపులు జరిపిన వ్యవహారానికి సంబంధించి వివరాలు, ఎం బుక్‌ పేపర్లను సమర్పించాలని కోరారు. అలాగే మొబిలైజేషన్‌ అడ్వాన్సులకు సంబంధించి చెల్లింపులు చేసిందెంత? ఎంత రికవరీ చేశారు? ఆ ఏజన్సీలు సమర్పించిన బ్యాంకు గ్యారంటీల వివరాలను తెలియజేయాలని పేర్కొన్నారు.

పోలవరం ప్రధాన డ్యాం పనులు చేపట్టిన అసలు కాంట్రాక్టర్‌కు ఏజెన్సీకి జరిపిన చెల్లింపులు, ఎం బుక్‌, ఏ కొలతల వద్ద పనులు ఆపేసిందో లాంటి వివరాలు, పాత కాంట్రాక్టర్ నుంచి 60 సి కింద పనులు తొలగించి కొత్తవారికి అప్పగించడం.. పనలు అంచనా విలువ, ఒప్పందం, అనుబంధ వివరాలను అందజేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేశారని చెబుతున్న పరిశోధన కేంద్రం ఫొటోలు, ఏ పరికరాలను అక్కడ ఏర్పాటు చేశారు, వాటి వివరాలు సమర్పించాలని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.