యాప్నగరం

విజయవాడలో టీడీపీకి భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేతలు

విజయవాడలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 150 మంది వైసీపీలోకి చేరారు.

Samayam Telugu 6 Sep 2020, 4:50 pm
కృష్ణా జిల్లా విజయవాడలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ (వైఎస్సార్ టీయూసీ) లోకి టీడీపీకి చెందిన 150 మంది కార్మికవర్గ సభ్యులు చేరారు. వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ ఫలాలు, ఆయన పని తీరును చూసి ఆకర్షితులై వైసీపీలోకి చేరుతున్నారని తెలిపారు.
Samayam Telugu వైసీపీలోకి టీడీపీ నేతలు


వైసీపీ ప్రభుత్వం ద్వారా భవిష్యత్‌ తరాలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే నగరంలోని టీడీపీకి చెందిన స్వీట్‌ స్టాల్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు పార్టీలో చేరారని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని వైఎస్సార్ స్వీట్‌ స్టాల్ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సైతం ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

టీడీపీలో ఆదరణ లేకపోగా, కులాల కంపుతో తమ అస్తిత్వాన్ని చంపుకుని ఉండలేమని అసోసియేషన్ సభ్యులు వైఎస్సార్‌సీపీలోకి చేరారని గౌతమ్ రెడ్డి తెలిపారు. ప్రజల మనిషిగా, పేదలకు సాయం చేసే వ్యక్తిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట తాము నడుస్తామని వారంతా పార్టీ చేరుతున్నారన్నారు. సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు కరోనా విపత్తు సమయంలో కూడా ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.