యాప్నగరం

దిశ చట్టంతో ప్రయోజనమేంటి..? పోలీసులే ఆ సలహా ఇస్తారా? జగన్‌పై పవన్ ఫైర్..!

ధర్మవరంలో స్నేహలత అనే యువతి దారుణ హత్యకు గురైన విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దిశ చట్టంతో ప్రయోజనం ఏంటని సీఎంను నిలదీశారు.

Samayam Telugu 24 Dec 2020, 6:14 pm
అనంతపురం: ధర్మవరంలో స్నేహలత అనే దళిత యువతి దారుణ హత్యకు గురైన ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశామని.. నేరం చేసిన వారికి 21 రోజుల్లోనే శిక్ష పడుతుందని జగన్ సర్కారు ప్రచారం చేసిందని.. కానీ ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. మైనర్ బాలికలు, విద్యార్థినులు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు ఆగలేదన్నారు.
Samayam Telugu jagan-pawan


ఉన్మాదుల చేతుల్లో అమాయక మహిళలు ప్రాణాలు కోల్పుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని పవన్ కళ్యాణ్ మండి పడ్డారు. విజయవాడలో రెండు ఘటనలు, గాజువాకలో ఒక ఘటన జరిగిందని.. ఇప్పుడు ధర్మవరంలో పేద దళిత యువతి హత్యకు గురవడం బాధించిందన్నారు.

‘పేద కుటుంబానికి చెందిన స్నేహలత అనే యువతి.. వేధింపులు భరించలేక చదువు మధ్యలోనే మానేసి ఉద్యోగంలో చేరిందని తెలిసింది. మా బిడ్డను వేధిస్తున్నారు.. మా ఇంటి ముందుకొచ్చి భయపెడుతున్నారని పోలీసు స్టేషన్‌కు వెళ్తే అధికారుల ప్రవర్తన ఆ తల్లిదండ్రులను మరింత కుంగదీసింది. అక్కడి నుంచి ఇల్లు మారిపోండి అని సలహా ఇచ్చారు’ అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వ్యవస్థ వైఫల్యం వల్లే స్నేహలత హత్యకు గురైందని జనసేనాని ఆరోపించారు.

చిత్త శుద్ధి లేకుండా చట్టాలు చేస్తే ఏ మాత్రం ప్రయోజనం ఉండదని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ దిశా చట్టమేనని పవన్ కళ్యాణ్ తెలిపారు. దిశ చట్టం చేయగానే పాలాభిషేకాలు చేయించుకొని.. కేకులు కోయించుకున్నారని.. చట్టాన్ని మాత్రం ఆచరణలోకి తీసుకురాలేదన్నారు. ప్రచారం కోసం చేసిన ఈ చట్టం ఆడబిడ్డలకు ఎలా రక్షణ ఇస్తుందో సీఎం జగన్ సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.