యాప్నగరం

మండలి రద్దు... ఓటింగ్‌కు 18 మంది వైసీపీ ఎమ్మెల్యేేలు దూరం.. ‘అనారోగ్య’ కారణాలే అధికం!

AP Assembly | శాసన మండలి రద్దు గురించి అసెంబ్లీ ఓటింగ్ జరగ్గా 18 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

Samayam Telugu 28 Jan 2020, 12:01 pm
ఏపీ శాసన మండలి రద్దు చేయాలని సీఎం జగన్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. తీర్మానంపై చర్చ అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ నిర్వహించారు. 133 మంది సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేశారు. సభలో ఉన్నవారిలో ఎవరూ ఈ తీర్మానానికి తటస్థంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఓటేయలేదు. దీంతో మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపినట్టు స్పీకర్ ప్రకటించారు. అధికార పార్టీకి సీఎం సహా 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా... ఓటింగ్ జరిగిన సమయంలో 18 మంది సభలో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
Samayam Telugu why 18 ysrcp mlas not participated in voting on abolition of ap legislative council
మండలి రద్దు... ఓటింగ్‌కు 18 మంది వైసీపీ ఎమ్మెల్యేేలు దూరం.. ‘అనారోగ్య’ కారణాలే అధికం!


జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ఓటింగ్‌లో పాల్గొని ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయగా.. టీడీపీ నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ అసెంబ్లీ లాబీలో ఉండిపోయారు. ఇటీవల జగన్‌ను కలిసిన గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలగిరి ఓటింగ్ జరిగిన సమయంలో అసెంబ్లీలో లేరు. విప్‌లు చెవి రెడ్డి భాస్కర రెడ్డి, దాడి శెట్టి రాజా కూడా ఓటింగ్ దూరమయ్యారు.

ఓటేయని 18 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో 9 మంది సభకు హాజరు కాలేదు. మరో 9 మంది సభకు వచ్చినా సోమవారం సాయంత్రం నిర్వహించిన ఓటింగ్‌లో పాల్గొనలేదు. అసెంబ్లీలో ఓటింగ్ ప్రారంభానికి ముందు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు బయటకు వెళ్లారు. వీరు వచ్చేసరికే తలుపులు మూసేశారు. దీంతో వీరు ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు.

ప్రత్తిపాడు పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్‌, యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి రాజు సభకు వచ్చినా.. ఓటింగ్ జరిగే సమయం వరకు అసెంబ్లీలో లేరు. కుటుంబీకులు, బంధువులకు బాగోలేదని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వెళ్లారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చిందట. ఆరోగ్యం బాగోలేకపోవడంతో దాడిశెట్టి రాజా హాస్పిటల్‌కు వెళ్లారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి కూడా హాస్పిటల్లో ఉండటం గమనార్హం. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి జ్వరం కారణంగా సభకు రాలేదు.

డిప్యూటీ స్పీకర్, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్లలోని భావనరసింహ స్వామి ఆలయంలో నిర్వహించిన అష్టబంధన మహా సంప్రోక్షణ, కుంభాభిషేకాల్లో పాల్గొన్నారు. పొలిమేర దాటొద్దనే కారణంతో ఆయన సభకు హాజరు కాలేదు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సోమవారం సభకు హాజరు కాలేదు.

తల్లి చనిపోవడంతో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సభకు రాలేకపోయారు. తన మిత్రుడి తల్లికి బాగోలేదనే కారణంతో మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా బెంగళూరు వెళ్లారు. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఐటీ విచారణకు వెళ్లారు.

మండలి రద్దు గురించి ఓటింగ్ ఉంటుందని ముందుగానే పార్టీ సమాచారం పంపినా.. ఇంత మంది ఓటింగ్‌కు దూరంగా ఉండటం అనుమానాలకు తావిచ్చింది. తమకు బాగోలేదని, తమ వారికి బాగోలేదని ఇంత మంది ‘అనారోగ్య’ కారణాల రీత్యా ఓటింగ్‌కు దూరం కావడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.