యాప్నగరం

జగన్ సర్కారు గుడ్ న్యూస్.. ‘అమ్మ ఒడి’ కీలక నిబంధన మినహాయింపు, 300 యూనిట్ల కరెంట్..

అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభిస్తోన్న జగన్ సర్కారు పేదరికం కారణంగా పిల్లలను సక్రమంగా బడికి పంపలేకపోతున్న గుడ్ న్యూస్ చెప్పింది. హాజరు నిబంధనను మినహాయించింది.

Samayam Telugu 6 Jan 2020, 10:14 pm
అమ్మ ఒడి పథకాన్ని జగన్ సర్కారు జనవరి 9న ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. బడికెళ్లే పిల్లలున్న తల్లులకు ఏటా రూ.15 వేలు అందజేసే ఈ పథకం నిబంధనల్లో ఏపీ ప్రభుత్వం సడలింపునిచ్చింది. 75 శాతం హాజరు తప్పనిసరి అనే నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. తొలి ఏడాది మాత్రమే ఈ సడలింపు వర్తింస్తుందని పేర్కొంది. పిల్లలను పాఠశాలకు పంపేలా.. తల్లిదండ్రులను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించిన ఈ పథకంలో.. తొలి ఏడాది స్ఫూర్తి నింపేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
Samayam Telugu amma vodi


వచ్చే ఏడాది నుంచి 75 శాతం హాజరు నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సిందేనని జగన్ సర్కారు స్పష్టం చేసింది. నాడు -నేడు, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజనం నాణ్యతపై సీఎం జగన్‌ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు సూచనలు చేశారు.

7231 అనాథ పిల్లలకు అమ్మ ఒడి డబ్బును సగం అనాథశ్రమాలకు, సగం పిల్లల పేరిట డిపాజిట్‌ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 1.81 లక్షల పిల్లలకు సంబంధించి.. వారి వారి కుటుంబాల్లో నెలకు 300 పైబడి యూనిట్ల కరెంట్ ఉపయోగిస్తున్నారు. వీటిలో కొన్ని ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందిస్తూ.. రీ వెరిఫికేషన్‌ చేయించి, అర్హులందరికీ అమ్మ ఒడి వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు.

అమ్మఒడి పథకం కింద తొలి విడతలో 42,80,823 మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించారు. ఈ పథకం ద్వారా 81,72,224 మంది పిల్లలకు లబ్ధి చేకూరుతుంది. ఒక్కో తల్లి పేరిట రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేయడం కోసం ప్రభుత్వం రూ.6,455.80 కోట్లు మంజూరు చేసింది. నవరత్నాల్లో భాగమైన అమ్మ ఒడి పథకాన్ని జనవరి 9న చిత్తూరు జిల్లాలో సీఎం ప్రారంభిస్తారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా శ్రీకారం చుట్టిన ఈ పథకం వల్ల.. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థుల తల్లులకు లబ్ధి చేకూరుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.