యాప్నగరం

ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు: జగన్ సర్కారు కీలక నిర్ణయం

Rythu Bharosa Centres | వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి 11,154 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. పశువులకూ హెల్త్ కార్డులను జారీ చేస్తామని ఆయన చెప్పారు.

Samayam Telugu 22 Jan 2020, 6:44 pm
రైతు సంక్షేమం దిశగా జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం జగన్ తెలిపారు. 11,154 రైతు భరోసా కేంద్రాలను గ్రామ సచివాలయాల పక్కనే ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లోనే రైతుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం వెల్లడించారు. 2 వేల జనాభా ఉన్న గ్రామాల్లో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న జగన్.. ఫిబ్రవరి నాటికి 5,300 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు సలహాలు- సూచనలు అందించేందుకు ఈ కేంద్రాలు పనిచేస్తాయని జగన్ తెలిపారు.
Samayam Telugu ysj1


‘రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు అందిస్తాం. ప్రభుత్వ స్టాంప్ తో నాణ్యతతో కూడిన విత్తనాలను అందిస్తాం. ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పించేలా, వ్యవసాయంలో నూతన విధానాలను అందించేలా వర్క్ షాపులను నిర్వహిస్తాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా మట్టి పరీక్షలు కూడా చేయిస్తాం’ అని జగన్ తెలిపారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాలపై చర్చ సందర్భంగా జగన్ ఈ విషయాలను వెల్లడించారు.

పంట వేయడానికి ముందే కనీస మద్దతు ధరలు ప్రకటించామన్న జగన్.. కొత్తగా పశువులకు కూడా హెల్త్ కార్డులు జారీ చేస్తామని పంట బీమా కార్డులు ఇస్తామని తెలిపారు. ప్రతి అంశంలోనూ రైతులకు అండగా ఉంటామన్నారు. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేoదుకు 1700 కోట్లతో ఫీడర్లను ఆధునీకరించామన్న సీఎం.. ధాన్యం కోసం మాయిశ్చర్ మీటర్లు అందుబాటులో ఉంటాయన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.