యాప్నగరం

రాజధానిపై బొత్స కీలక వ్యాఖ్యలు.. అదే జరగబోతుందా?

AP Capital Amaravati | రాజధానిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడుతుందన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ప్రకటన చేస్తుందన్నారు.

Samayam Telugu 6 Nov 2019, 10:13 pm
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. సింగపూర్ సంస్థలు వెనక్కి మళ్లాయి. మంత్రి బొత్స ప్రకటనలతో.. రాజధానిపై గందరగోళం నెలకొంది. తాజాగా రాజధానిపై బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. నిపుణుల కమిటీ 13 జిల్లాల్లో పర్యటిస్తోందని.. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత.. రాజధానిపై ప్రభుత్వం త్వరలో ప్రకటన చేస్తుందని బొత్స తెలిపారు. ఫలానా తేదీలోగా అని స్పష్టంగా చెప్పనప్పటికీ.. త్వరలోనే ఆ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. కమిటీకి సర్కారు ఆరు వారాల గడువు ఇచ్చిందన్నారు.
Samayam Telugu botsa amaravati


నిపుణుల కమిటీ సూచనల ఆధారంగా ఏ భవనం ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తామన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు సర్కారు అమరావతిపై గెజిట్ విడుదల చేయలేదన్న బొత్స.. ఫలితంగానే అది తాత్కాలిక రాజధాని అనే భావన ఉందన్నారు. అమరాతిలో శాశ్వత నిర్మాణాలు లేవన్నారు.

రాజధాని నిర్మాణం కోసం రూ.5,400 కోట్లు ఖర్చయిందని, 90 శాతం పనులు పూర్తయినట్టు ఏ నిపుణుడితోనైనా చెప్పించండని బొత్స టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల భవనాలు 67 శాతం పూర్తయ్యాయని, ఐఏఎస్ అధికారుల భవనాలు 26 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎన్జీవోలు, ఐఏఎస్ అధికారుల భవనాలు మినహా మిగతావన్నీ తాత్కాలిక భవనాలేనని బొత్స స్పష్టం చేశారు.

కమిటీ నివేదిక ఆధారంగా రాజధానిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని బొత్స చెప్పడం ద్వారా.. రాజధాని మార్పు ఖాయమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ రాజధానిని అమరావతిలోనే ఉంచినా.. వికేంద్రీకరణకు జగన్ సర్కారు మొగ్గు చూపే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.