యాప్నగరం

YS Jagan రాజకీయ జీవితానికి ఆ జీవో మరణశాసనం, వైఎస్ వెయ్యి రెట్లు బెటర్: చంద్రబాబు

మీడియా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో విషయమై చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ జీవోనే జగన్ రాజకీయ జీవితానికి మరణశాసనం రాస్తుందని హెచ్చరించారు. జగన్ కంటే వైఎస్ వెయ్యిరెట్లు బెటర్ అన్నారు.

Samayam Telugu 18 Oct 2019, 1:30 pm
ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా, తప్పుడు కథనాలు రాసే మీడియాపై కేసులు పెట్టే అధికారాన్ని సెక్రటరీకలకు కల్పిస్తూ జగన్ సర్కారు జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. ఈ జీవోనే వైఎస్ జగన్ రాజకీయ జీవితానికి మరణశాసనం అవుతుందన్నారు. ఈ జీవో వల్ల మీడియా ఏం రాయడానికి వీల్లేకుండాపోతుందని.. రాజకీయ నాయకులు కూడా ఏం మాట్లాడటానికి ఉండదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu jaganvsbabu


జగన్ తనకు నచ్చిన మీడియాకే ప్రకటనలు ఇస్తున్నారని.. ఈ విషయమై నిలదీస్తే కేసులు పెడుతున్నారని బాబు ఆరోపించారు. తప్పు చేసిన వాళ్లను అడిగే స్వేచ్ఛను, విమర్శించే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. ఈ రోజు కేసులు పెట్టిన అధికారులు.. రేపు జైళుకెళ్తారని బాబు హెచ్చరించారు. తన జైలు సహచరులను పైరవీ కోసం జగన్ ఢిల్లీ అంతా తిప్పుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణమే విరమించుకోవాలని.. లేదంటే భవిష్యత్తులో ఇదే మీకు ఓ శాపంగా మారుతుందని బాబు హెచ్చరించారు. అందర్నీ నియంత్రించాలని తీసుకొచ్చే ఈ జీవోనే మీకు మరణశాసనం అవుతుందని బాబు హెచ్చరించారు. ఇష్టానుసారంగా ఏమైనా చేస్తానంటున్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన నాకు డీజీపీ నోటీసులు పంపుతామంటున్నారు. పంపమనండి చూస్తానంటూ బాబు వ్యాఖ్యానించారు.

డీజీపీ, సీఎం, ప్రతిపక్ష నేత, అసెంబ్లీ, పత్రికలు.. అందరూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని బాబు హితవు పలికారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ సౌతిండియా బిహారే కాదు.. భారత బిహార్‌గా మారుతోందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులు కూడా ఇవ్వకుండా మీడియా ఆఫీసులను కూల్చేస్తున్నారని బాబు తెలిపారు. ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, జగన్ మోహన్ రెడ్డి శాశ్వతం కాదు. ఈ రాష్ట్రం శాశ్వతమని బాబు చెప్పారు. నేను సీఎం అయినప్పుడు రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉండేది.. నా పాలనలో దేశంలోనే అత్యధిక పురోగతి నమోదైందని బాబు గుర్తు చేశారు.


Read Also: వైఎస్‌ను అభినందించాలి.. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

‘‘ఇలా చేసిన ఎవరూ మనుగడ సాగించలేదు. చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంటే చూస్తూ కూర్చోవాలా?’’ అని బాబు ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి పట్టువిడుపులతో వ్యవహరించారని.. ఓ విధంగా ఆలోచిస్తే.. జగన్ కంటే వైఎస్ వెయ్యిరెట్లు నయం అని బాబు తెలిపారు. వైఎస్ తప్పు చేసినప్పుడు క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు.

ఇటీవల హత్యకు గురైన జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకోవడం కోసం టీడీపీ తరఫున రూ.2 లక్షలు పరిహారం అందజేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.