యాప్నగరం

వైఎస్ వివేకా కుమార్తె సునీత సమక్షంలో ఆ ముగ్గురిని విచారించిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శుక్రవారం కూడా సీబీఐ విచారణ జరిపింది.

Samayam Telugu 31 Jul 2020, 6:36 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ శుక్రవారం 14వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలులోని అతిథి గృహంలో జరుగుతున్న విచారణకు వివేకా వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, పని మనిషి లక్ష్మీదేవి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయ్‌ తుల్లా శుక్రవారం హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేందుకు ఈ ముగ్గురూ ఒకే కారులో పులివెందుల నుంచి కడపకు వచ్చారు. వీరు విచారణ గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే వివేకా కుమార్తె సునీత కూడా విచారణకు హాజరయ్యారు.
Samayam Telugu వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ


కాగా, సునీతను సీబీఐ అధికారులు ప్రశ్నించడం ఇది మూడో సారి. అయితే వివేకా చనిపోయిన రోజు అసలు ఏం జరిగిందనే దానిపై ఈ ముగ్గురినీ శుక్రవారం సునీత సమక్షంలోనే సీబీఐ అధికారులు ప్రశ్నించారు. గతేడాది మార్చి 15న ఉదయం 5.30 గంటలకు వివేకా వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి మొదటిగా ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన తలుపు తీసి చూస్తే బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో వివేకా శవమై కనిపించారు.

అనంతరం కృష్ణారెడ్డి వివేకా మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వివేకా బెడ్‌రూమ్‌లో కృష్ణారెడ్డికి ఒక లేఖ కూడా దొరికింది. కానీ ఆ లేఖను సాయంత్రం వరకు పోలీసులకు ఇవ్వలేదు. సాయంత్రం వివేకా కుమార్తె సునీత సమక్షంలో లేఖను కృష్ణారెడ్డి పోలీసులకు అప్పగించారు. గతంలో కృష్ణారెడ్డిని సిట్‌ అధికారులు అరెస్ట్‌ కూడా చేశారు. ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.