యాప్నగరం

‘వివేకా హత్య కేసు: సీఎం జగన్ రహస్య హైదరాబాద్ పర్యటన?’

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ నేత వర్ల రామయ్య బుధవారం మీడియాతో మాట్లాడారు.

Samayam Telugu 6 Dec 2022, 5:30 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హఠాత్తుగా హైదరాబాద్‌ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. వాస్తవానికి బుధవారం (జనవరి 29) జగన్ షెడ్యూల్‌లో హైదరాబాద్ పర్యటన లేకపోయినా ఆయన రహస్యంగా వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. సోదరి సునీతను కలిసి రిట్‌ పిటిషన్‌పై ప్రశ్నించడానికి వెళ్లారా? లేక పిటిషన్‌ను వెనక్కి తీసుకునేలా చేయడానికి వెళ్తున్నారా? అని వర్ల అనుమానం వ్యక్తం చేశారు.
Samayam Telugu Varla Ramaiah


Also Read: వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబీకుల పేర్లు.. అసలేం జరుగుతోంది?

మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసును గతంలో సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేసిన సీఎం జగన్‌ ఇప్పుడెందుకు ఆలస్యం చేస్తున్నారని వర్ల ప్రశ్నించారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై నమ్మకం లేదని ఆయన పదేపదే వ్యాఖ్యానించలేదా? అని అన్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరిటాల రవి హత్య కేసులో జగన్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన అసెంబ్లీలోనే సీబీఐకి అప్పగించారని గుర్తు చేశారు.

అయితే వివేకా హత్య కేసులో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో కేసును సీబీఐకి అప్పగిస్తారని ఇన్నాళ్లూ ఎదురు చూసినట్లు తెలిపారు. అయితే కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌పై నమ్మకం లేదని, సీఎం అయ్యాక మరో సిట్‌ వేశారని గుర్తు చేశారు.

Also Read: జగన్‌ను సీఎం చేసేందుకే వివేకా హత్య.. లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

అలాగే వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని మంగళవారం ఆయన కుమార్తె సునీత హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అందులోని విషయాలను ప్రస్తావించారు. తన సోదరుడైన వైఎస్ జగన్‌పై నమ్మకం లేకనే ఆమె కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టును ఆశ్రయించారని అభిప్రాయపడ్డారు. రిట్‌ పిటిషన్‌లో సునీత అనుమానితుల జాబితా ఇచ్చారని, సీబీఐ విచారణకు ఇస్తే వాస్తవాలు బయటకొస్తాయని జగన్‌ భయపడుతున్నారా? అని వర్ల అన్నారు. ఇప్పటికైనా వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Also Read: వివేకా హత్యపై హైకోర్టు సంచలనం.. కేసును సీబీఐకి ఎందుకివ్వరు?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.