యాప్నగరం

‘మాజీ మంత్రి రాజాపై దాడి.. తెనాలిలో తీవ్ర ఉద్రిక్తత’

తెనాలి పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి కోసం శాంతియుతంగా దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజాపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్లుట్లు టీడీపీ ఎంపీ జయదేవ్ ట్వీట్ చేశారు.

Samayam Telugu 25 Jan 2020, 4:34 pm
గుంటూరు జిల్లా తెనాలిలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఇతర నిరసనకారులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడినట్లు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు. రాజా సహా ఇతరులపై కోడిగుడ్లతో దాడి చేసి, ధర్నా క్యాంప్‌కు నిప్పుపెట్టినట్లు తెలిపారు. వైసీపీ నేతల పిరికిచర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సమస్యలు, పరిస్థితులను చక్కదిద్దేందుకు వైపీపీ ప్రభుత్వం దగ్గర ఉన్న పరిష్కార మార్గాలు బెదిరింపులు, హింస మాత్రమేనని వ్యాఖ్యానించారు. తన ట్వీట్‌కు ఏబీఎన్ చానెల్ వీడియో లింక్‌ను ఎంపీ జయదేవ్ జోడించారు.
Samayam Telugu raja


కాగా, అమరావతి రిలే దీక్ష శిబిరంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయులు తోపులాటకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజా సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పే యత్నం చేశారు.

ఈ ఘటనపై టీడీపీ టౌన్ అధ్యక్షుడు మొహమ్మద్ కుదుష్ మాట్లాడుతూ.. శాంతియుతంగా రాజధాని కోసం నిరసన చేస్తున్న తమపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు పక్కనే ఉన్నా కనీసం దాడిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. మరోవైపు టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన అమరావతి దీక్షా శిబిరాన్ని తొలగించేందుకు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.