యాప్నగరం

రాజ్యసభ అభ్యర్థుల్ని ఖరారు చేసిన వైసీపీ

రాజ్యసభ సీట్ల కోసం ఎంతో మంది పోటీ పడ్డారు. దీంతో ఆశావహులకు చెక్ పెట్టి ఆ నలుగురికి జగన్ పెద్దల సభకు పంపేందుకు నిర్ణయించుకున్నారు. మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్‌కు రాజ్యసభ సీట్లను కేటాయించారు.

Samayam Telugu 9 Mar 2020, 6:14 pm
అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు రాజ్యసభ అభ్యర్థుల్ని వైసీపీ ఖరారు చేసింది. ఏపీ తరపున నలుగురు అభ్యర్థుల్ని పార్టీ ప్రకటించింది. ముందు నుంచి అనుకున్నట్లుగానే మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్లను ప్రకటించింది. వైసీపీ సీనియర్ నేత అయోధ్య రామిరెడ్డికి కూడా రాజ్యసభ బెర్త్ ఖరారు చేసింది. ఇక రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కోరిక మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు పరిమళ్ నత్వానికి రాజ్యసభ సీటు కేటాయించారు.
Samayam Telugu cm jagan.


మండలి రద్దు తీర్మానంతో.. మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ పదవులు వదులుకోవాల్సి వచ్చింది. దీంతో వారిద్దరికి పెద్దల సభకు పంపేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో లోక్‌సభ పోటీ చేసి ఓటమి పాలైనా... అయోధ్య రామిరెడ్డికి... గత ఎన్నికల్లో టికెట్ వదులుకోవడంతో జగన్... రాజ్యసభ సీటును కేటాయించారు. మిగిలిన స్థానాన్ని పరిమళ్ నత్వానికి కేటాయించారు.
అయితే రాజ్యసభ రేసులో అనేక మంది పోటీ పడ్డారు. బీసీ నుంచి మైనార్టీల నుంచి తమకు రాజ్యసభ పదవి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ జగన్ మాత్రం రాజ్యసభ సీట్ల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి...నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ప్రస్తుతం స్థానిక ఎన్నికల వేడితో పాటు... రాజ్యసభ ఎన్నికల టెన్షన్ కూడా నడుస్తోంది. దేశవ్యాప్తంగా 250 మంది సభ్యులున్న రాజ్యసభలో... ఏప్రిల్‌ నెలలోపు 55 మంది ఎంపీల పదవికాలం పూర్తికానుంది. ముందుగా ఖాళీ అయిన స్థానాలకు మార్చి 26న పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.