బ్రదర్ అనిల్ ఫోన్, కారు నంబర్లు 151: ఆయన ప్రార్థనల వల్లే.. జూపూడి ఆసక్తికర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్పై వైసీపీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu 24 Jan 2021, 8:33 pm
తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు క్రైస్తవులపై చేసిన వ్యాఖ్యలు చారిత్రక తప్పిదమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకరరావు పేర్కొన్నారు. తమ మనోభావాలను కించపరిస్తే సహించేది లేదని వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో శనివారం నిర్వహించిన పాస్టర్ల ఫెలోషిప్, క్రైస్తవ సంఘ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంరద్భంగా జూపూడి ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్ ప్రార్థనలు చేయడం వల్లే రాష్ట్రంలో అధికారం మారిపోయిందని జూపూడి ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు. బ్రదర్ అనిల్ మొబైల్ చివరి మూడు నంబర్లు 151 అని, కారు చివరి 3 నంబర్లు 151 అని, వైసీపీకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 151 అని పేర్కొన్నారు. బ్రదర్ అనిల్ వైసీపీకి ఎమ్మెల్యేల సంఖ్య కూడా 151 రావాలని ప్రార్థన చేశారని చెప్పుకొచ్చారు. విజయమ్మ బైబిల్ పట్టుకుని తిరిగినా కూడా ప్రజలు ఆదరించారన్న వాస్తవాన్ని చంద్రబాబు గమనించాలని సూచించారు.
అలాగే క్రైస్తవులు బలవంతపు మత మార్పిడిలు చేస్తున్నారంటూ చంద్రబాబు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని జూపూడి ప్రభాకర్ ఆరోపించారు. క్రైస్తవుల మనోభావాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోబోమని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఓడిపోయిన తర్వాత మానసికంగా దెబ్బతిని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. దేవతా మూర్తుల విగ్రహాలు ధ్వంసం చేసిన వారు ఏ మతస్తుడైనా శిక్షార్హుడని తేల్చి చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలతో క్రైస్తవులు టీడీపీని వదిలిపెట్టి ఇతర పార్టీలకు వెళ్లే యోచనలో ఉన్నారని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్ ప్రార్థనలు చేయడం వల్లే రాష్ట్రంలో అధికారం మారిపోయిందని జూపూడి ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు. బ్రదర్ అనిల్ మొబైల్ చివరి మూడు నంబర్లు 151 అని, కారు చివరి 3 నంబర్లు 151 అని, వైసీపీకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 151 అని పేర్కొన్నారు. బ్రదర్ అనిల్ వైసీపీకి ఎమ్మెల్యేల సంఖ్య కూడా 151 రావాలని ప్రార్థన చేశారని చెప్పుకొచ్చారు. విజయమ్మ బైబిల్ పట్టుకుని తిరిగినా కూడా ప్రజలు ఆదరించారన్న వాస్తవాన్ని చంద్రబాబు గమనించాలని సూచించారు.