యాప్నగరం

ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యే కరోనా వైరస్ బారినపడ్డారు. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుకు కరోనా సోకింది.

Samayam Telugu 21 Sep 2020, 5:54 pm
ఆంధ్రప్రదేశ్‌లో మరో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. కృష్ణా జిల్లా నందిగామ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు తెలిపారు. గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు వెంటనే కోవిడ్‌ పరీక్ష చేయించుకుని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
Samayam Telugu వైఎస్సార్ సీపీ జెండా
YSRCP Flag


కరోనా చికిత్స చేయించుకుంటున్న కారణంగా కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరు ఫోన్ చేయొద్దని, అలాగే కలవటానికి కూడా ప్రయత్నించవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. భగవంతుడు, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు పేర్కొన్నారు.
కాగా, రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో అధికార వైసీపీ ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కరోనా శాంతించినట్లు కనిపిస్తోంది. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 56,569 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 6,232 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 6,31,749కు చేరుకున్నాయి. అలాగే సోమవారం 51 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,410కు చేరుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.