యాప్నగరం

Visakhapatnam వరుస ప్రమాదాల వెనుక భారీ కుట్ర.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ వ్యాఖ్యలు

విశాఖపట్నంలో చోటుచేసుకున్న వరుస ప్రమాదాలపై అధికార వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 14 Jul 2020, 9:07 pm
విశాఖపట్నంలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ తర్వాత వరుసగా ప్రమాదాలు జరగడంపై తనకు వ్యక్తిగతంగా అనుమానాలున్నాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ వరుస ప్రమాదాల వెనక కుట్ర కోణాలున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.
Samayam Telugu విశాఖపట్నం ప్రమాదాలు


టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతల తీరు చూస్తుంటే విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ కొట్టి రాజధాని రాకుండా ఆలోచన చేస్తున్నారనే భయం కలుగుతోందని ఎమ్మెల్యే అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఫార్మా సిటీ ఘటనపై లింగమనేని బ్రదర్స్‌ మాట్లాడిన తీరు చూస్తే ఏదో కుట్ర ఉందేమో అనుమానం కలుగుతోందన్నారు. 2014లో కూడా రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వని రైతుల అరటి తోటలను తగులబెట్టి వైఎస్సార్‌సీపీపై నెపం వేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఏ ఘటన జరిగినా చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

శవాల మీద పేలాలు ఏరుకునే రీతిలో చంద్రబాబు ఎక్కడ ఏ ఘటన జరిగితే అందులో దూరిపోయి రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే అమర్‌నాథ్ దుయ్యబట్టారు. వరస ప్రమాదాలపై టీడీపీ ఆరోపణలు చేయడం సరికాదని, ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై ప్రజలకిచ్చిన మాట ప్రకారం విచారణ జరిపి దోషులను జైలుకు పంపించామని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో ఏ ప్రమాదం జరిగినా దోషులను జైలుకు పంపించారా అని ప్రశ్నించారు. విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బకొట్టే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.