యాప్నగరం

TDP నేతలపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు తెలుగు దేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు.

Samayam Telugu 31 Aug 2020, 3:10 pm
తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తమ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మండిపడ్డారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ నేతలు దండుపాళ్యం బ్యాచ్‌గా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో భూములు కొట్టేశారని, ముడుపులు తీసుకుని అడ్డగోలుగా ప్రైవేట్ సంస్థలకు భూములు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.
Samayam Telugu కొలుసు పార్థసారథి


పేదరికమే ప్రామాణికంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలను ఎంపిక చేశారని ఎమ్మెల్యే పార్థసారథి చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పేదలను విస్మరించి ఎన్నారైలకు ఇళ్ల స్థలాలు, భూములు కేటాయించారని ఆరోపించారు. మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాలను అడ్డుకోవడమే చంద్రబాబు ఆలోచనని, ఆయన మనస్తత్వం ఏపాటిదో అర్థమవుతుందన్నారు. పేదలకు సెంటు భూమి కూడా అమరావతిలో కేటాయించలేదని, కోట్లు దండుకుని ప్రైవేట్‌ సంస్థలకు ఇచ్చారని చెప్పారు.

నివాస యోగ్యం కానీ భూముల్లో లక్షలు పెట్టి దోచుకున్నారంటూ టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. పెనమలూరు మండలంలో ఎకరా భూమి రూ.1.20 కోట్లపైగానే ఉందన్నారు. రూ. 43 లక్షలకు ఎకరా భూమి ఇప్పిస్తే టీడీపీ నేతలకు సన్మానం చేస్తానన్నారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.