యాప్నగరం

వైసీపీ ఎమ్మెల్యే లాక్ డౌన్ ఉల్లంఘన.. కేసు పెట్టడంతో ధర్నా, రాజీనామా చేస్తానంటూ..

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన పోలీస్ స్టేషన్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Samayam Telugu 11 Apr 2020, 6:53 pm
లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన ధర్నాకు దిగారు. పోలీసుల వైఖరికి నిరసనగా తన అనుచరులతో కలిసి బుచ్చిరెడ్డిపాలెం పోలీసు స్టేషన్‌ ఎదుట ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు.
Samayam Telugu నల్లపురెడ్డి ప్రసన్న


నెల్లూరు జిల్లా కోవూరు వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెం పాఠశాల వద్ద 6,500 మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) పాటించకపోవడంతో జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రజలు గుంపులుగా చేరేందుకు కారణమైనందుకు, నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలతో ఎమ్మెల్యే నల్లపురెడ్డితో పాటు మరో ఏడుగురుపై 148, 188, 269, 270, 271 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో శనివారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అనుచరులతో కలిసి గేటుకు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. స్వయంగా ఎస్పీ వచ్చి తమను అరెస్టు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి తన నిరసన వ్యక్తం చేశారు. అలాగే తనకు సహకరించిన కొందరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయిస్తానని ఎస్పీ అంటున్నారని, ఒకవేళ అదే జరిగితే తాను పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.