యాప్నగరం

పులివెందులలో భారీ సభ పెడతా.. నాపై చెయ్యి పడిందో.. వైసీపీకి ఎంపీ రఘురామ సవాల్

తనకు రాయలసీమలో కూడా అనుచరులు ఉన్నారని, కరోనా తగ్గాక పులివెందులో భారీ సభ పెడతానని వైసీపీ ఎంపీ రఘురామ అన్నారు.

Samayam Telugu 18 Sep 2020, 7:02 pm
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ తీరుపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట పులివెందులలోనే తన ప్రతాపం ఏంటో చూపిస్తానంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.
Samayam Telugu రఘురామ కృష్ణంరాజు, సీఎం జగన్


శుక్రవారం ఢిల్లీలో ఎంపీ రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. కొంత మంది వైసీపీ నాయకుల మాదిరిగా తనకు సంస్కారహీనంగా మాట్లాడటం తనకు రాదని వ్యాఖ్యానించారు. తనపై ఎవరైనా చెయ్యి వేస్తే తగిన సమాధానం చెప్పగలిగే స్నేహితులు తనకు ఉన్నారని పేర్కొన్నారు. తన ఒంటిపై చెయ్యి పడితే ఎదుటి వ్యక్తి ఒళ్లంతా చితక్కొట్టే స్నేహితులు ఉన్నారని వ్యాఖ్యానించారు. రాయలసీమలో కూడా తనను ప్రేమించే వారు, స్నేహితులు ఉన్నారని వెల్లడించారు. తన నియోజకవర్గానికి రావాలని కొందరు అంటున్నారని, నా నియోజకవర్గానికే కాదు.. పులివెందులకు కూడా వెళ్తానని సవాల్ విసిరారు. కరోనా తగ్గాక పులివెందులలో 10 వేల మందితో సభ పెడతానని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులకు తాను భయపడే వ్యక్తిని కాదన్నారు.

అలాగే అమరావతి భూముల అంశంలో పునఃసమీక్ష కుదరదని హైకోర్టు చెప్పడం శుభపరిణామని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో అమరావతి భూముల అంశంపై సీబీఐ విచారణ జరపాలని ఢిల్లీలో ధర్నా చేశారు కానీ, అంతర్వేది ఘటనపై ఫ్లకార్డులు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై దాడి చేస్తూ గాంధీ విగ్రహం వద్ద రచ్చ చేశారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు శాసనసభకు లేదన్న కనీస అవగాహన కూడా వైసీపీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. న్యాయవ్యవస్థ వల్లే ప్రజలు అన్యాయం బారినపడకుండా బతుకుతున్నారని అన్నారు. న్యాయవ్యవస్థను తప్పుబట్టడం సరికాదని, గౌరవించడం నేర్చుకోవాలి ఎంపీ రఘురామ హితవు పలికారు. న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.