యాప్నగరం

జగన్ సర్కార్‌పై నమ్మకం పోయింది.. ఇక కేంద్రానిదే బాధ్యత.. వైసీపీ ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు

తన ప్రాణాలకు ముప్పు ఉందని, వెంటనే భద్రత కల్పించాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హోం శాఖ కార్యదర్శిని కోరారు.

Samayam Telugu 13 Jul 2020, 11:26 pm
తనపై లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించిన అనర్హత పిటిషన్‌ రాజ్యాంగ వ్యతిరేకమని.. నా అనర్హత పిటిషన్ అనర్హం అయిపోతుందని నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాల ద్వారా తనకు భద్రత కల్పించాలని 20 రోజుల క్రితం హోం శాఖ కార్యదర్శి కోరానని.. ఆ విషయం గురించి మాట్లాడటానికే సోమవారం ఢిల్లీలో హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాను కలిసినట్లు ఎంపీ వెల్లడించారు. త‌న‌కు భద్రత కల్పించాలని, తన ప్రాణాలకు ముప్పు ఉందని మరోసారి ఆయ‌న‌ దృష్టికి తీసుకెళ్లారు.
Samayam Telugu రఘురామ కృష్ణంరాజు


సాధారణంగా ఎంపీలకు భద్రత కల్పించే విషయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తనకు భద్రత కల్పిస్తారనే నమ్మకం పోయిందని రఘురామ వ్యాఖ్యానించారు. తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనపై కేసులు పెడుతున్నారని వాపోయారు. అందుకే కేంద్ర బలగాల రక్షణ కోరినట్లు వెల్లడించారు. భద్రత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం జరగాల్సి ఉందన్నారు.

అందుకే తనకు భద్రత కల్పించే అంశంలో ఆలస్యం జరుగుతోందని ఎంపీ రఘురామ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తనకు కేంద్ర బలగాల రక్షణ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక ఎంపీకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అది కల్పించనప్పుడు కేంద్రమే బాధ్యత తీసుకుంటుందని ఎంపీ రఘు రామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు. కాగా, గత నెల రోజులుగా ఎంపీ రఘురామకు, వైసీపీ అగ్ర నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, నందిగం సురేష్, మార్గాని భరత్, శ్రీకృష్ణ దేవరాయలు కలిసి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తనపై వేటు పడదంటూ.. వైసీపీ ప్రభుత్వాన్ని రఘురామ టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.