యాప్నగరం

జనం నినాదంగా ‘మా నమ్మకం నువ్వే జగన్‌’.. 7 లక్షల మందితో పీపుల్స్ సర్వే

Maa Nammakam Nuvve Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్ 7 నుంచి సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు ఇంటింటికీ తిరగనున్నారు. ఇందు కోసం 7 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 5 Apr 2023, 10:21 pm
జగనన్నే మా భవిష్యత్తు.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిదొక కొత్త నినాదం. వాడవాడలా ప్లకార్డుల ప్రదర్శనా క్యార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వ పథకాలతో సంతృప్తి చెందిన వారికి ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించి, వారితో స్వచ్ఛందంగా ప్లకార్డులు ప్రదర్శింపజేస్తున్నారు. ప్రజలు మద్ధతును సమీకరించి వాటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పట్టణాలు మొదలు మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలకు జగనన్న సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి వివరించేందుకు తలపెట్టిన కార్యక్రమమే ‘జగనన్నే మా భవిష్యత్తు’. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనేది ఈ కార్యక్రమ నినాదం.
Samayam Telugu ysrcp to launch jagananne maa bhavishyathu campaign on april 7 to take people survey
జనం నినాదంగా ‘మా నమ్మకం నువ్వే జగన్‌’.. 7 లక్షల మందితో పీపుల్స్ సర్వే


​ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ చేయని భారీ కార్యక్రమం

వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని, ఆ సంస్కరణల ఫలాలను సమీక్షించి.. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ కార్యక్రమం కోసం వైఎస్సార్ సీపీ 7 లక్షల మంది కార్యకర్తలతో సైన్యాన్ని నియమించింది. ప్రతి గ్రామ సచివాలయానికి ముగ్గురు చొప్పున కన్వీనర్లు, ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహ సారథులు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ చేయని భారీ కార్యక్రమం ఇదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

​1.6 కోట్ల ఇళ్ల ముంగిటకు వైసీపీ సైన్యం

ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 20 వరకూ కొనసాగుతుంది. ఈ 14 రోజుల ­పాటు రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 1.6 కోట్ల ఇళ్ల వద్దకు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు వెళ్లి ప్రజలతో మాట్లాడనున్నారు. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించి, జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాల గురించి చెబుతారు.

​మిస్డ్‌ కాల్‌ ఇస్తే.. సీఎం జగన్ నుంచి ఒక్క నిమిషంలో ఐవీఆర్‌ఎస్‌ కాల్‌

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి మంచి చేయడం కోసం అనుక్షణం తపిస్తోందని, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ అసత్యాల స్థానంలో వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని అంటున్నారు. ‘సీఎం జగన్‌ సంక్షేమ రథానికి ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుతగులుతున్న వైనాన్ని ప్రజలకు వివరిస్తాం. పీపుల్స్‌ సర్వేలో భాగంగా ప్రతి ఇంట్లోనూ సభ్యులను 5 ప్రశ్నలు అడిగి.. వారు చెప్పిన సమాధానాలను ‘ప్రజా మద్దతు పుస్తకం’లో నమోదు చేస్తాం. రశీదు కూడా ఇస్తాం’ అని వారు చెబుతున్నారు. జగన్‌ సర్కారుకు మద్దతు తెలిపేందుకు అంగీకరించిన వారితో 82960 82960 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులను కోరుతామని, ఇలా మిస్డ్‌కాల్‌ ఇచ్చిన ఒక్క నిమిషంలోగా వారికి సీఎం జగన్‌ సందేశంతో కూడిన ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ వస్తుందని తెలిపారు.

​వైఎస్సార్ సీపీ ఉన్నత శిఖరాలకు చేరువ అవుతోంది..

కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే బాధ్యత గల సుశిక్షితులైన కార్యకర్తలున్న పార్టీగా వైఎస్సార్ సీపీ ఉన్నత శిఖరాలకు చేరువ అవుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని ‘జగనన్నే మా భవిష్యత్తు.. తద్వారా మా నమ్మకం నువ్వే జగన్‌’ కార్యక్రమం ద్వారా నిరూపించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ‘సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాల ప్రజలు పూర్తి విశ్వసనీయత కనబరిచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ నినదించి.. ప్రతిపక్షాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని మేం బలంగా నమ్ముతున్నాం’ అని వైఎస్సార్‌సీపీ అనేతలు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మండల ఇన్‌చార్జ్‌లు, జోనల్‌ కో–ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తారని వెల్లడించారు.

​భవిష్యత్తులో గర్వంగా చెప్పుకుంటారు.. సీఎం జగన్ లక్ష్యం ఇదే

ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ అజెండాను రూపొందించుకొని పని చేయాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌ ఉన్నారని వైఎస్సార్‌ సీపీ నేతలు తెలిపారు. ‘మా పార్టీ భవిష్యత్తులో గర్వంగా చెప్పుకునేందుకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తోంది. అందుకే, ప్రజలతో మమేకమయ్యే ఈ భారీ కార్యక్రమం ఎలా ఉండాలి? మా పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే కన్వీనర్లకు శిక్షణ ఇచ్చాం’ అని తెలిపారు.

రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.