యాప్నగరం

ప.గో: అతివేగానికి ముగ్గురు బలి... దెందులూరులో అర్ధరాత్రి ఘోర ప్రమాదం

మంగళవారం అర్ధరాత్రి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 6 Jan 2021, 7:48 am
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. తొందరగా ఇంటికి చేరుకోవాలనే ఉత్సాహంతో వాహనాన్ని వేగంగా నడపడంతో అదికాస్తా అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపుగా వస్తున్న బస్సును ఢీకొంది. ఈ ఘటనలో వ్యాను, బస్సు ముందుభాగాలు ధ్వంసమయ్యాయి. వ్యానులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో దెందులూరు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది.
Samayam Telugu ప్రమాదంలో నుజ్జునుజ్జయిన వ్యాన్


Also Read: ఆళ్లగడ్డ: వాకింగ్‌కు వెళ్లిన యువకుడిపై కత్తులతో దాడి... రెండ్రోజుల్లో పెళ్లి

గుండగొలనుకు చెందిన పరసా రామకృష్ణ(25), వెలివెల గాంధీ(25), నాని (25)లు చేపలను పట్టి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి ఏలూరు వైపు నుంచి ముగ్గురూ వ్యానులో బయలుదేరారు. మరో ఐదు నిమిషాల్లో గుండగొలను చేరుకునే క్రమంలో అతివేగంతో వ్యాను అదుపుతప్పింది. డివైడర్‌ను దాటి రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సును ఢీకొంది.

ఈ ప్రమాదంలో వ్యాను నుజ్జునుజ్జు కావడంతో ముగ్గురు యువకులు అందులో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారు. బస్సులోని ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న దెందులూరు ఎస్‌ఐ రామ్‌కుమార్, సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. హైవే పెట్రోల్‌ పోలీసులు వ్యాన్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.