యాప్నగరం

అమలాపురంలో ధ్వంసమైన ఇల్లు మంత్రి విశ్వరూప్‌ది కాదు.. అసలు విషయం ఇది

AP Minister Pinipe Viswarup Rent Houseలో ఉంటున్నారంటున్న యజమాని. ఇల్లు ధ్వంసమైందని తెలసుకుని చూడటానికి వచ్చారు.. ఇష్టంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 26 May 2022, 5:28 pm

ప్రధానాంశాలు:

  • ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్న మంత్రి విశ్వరూప్
  • అమలాపురంలోనే కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు
  • మూడేళ్లగా అద్దె ఇంట్లో ఉంటున్నారన్న యజమాని
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu అమలాపురం
కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం వివాదానికి దారి తీసింది. జిల్లా పేరు మార్చొద్దంటూ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమలాపురంలో మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి దుండగులు నిప్పు అంటించారు.. పోలీసులుపై రాళ్ల దాడి జరిగింది. బస్సుల్ని కూడా తగులబెట్టారు.. ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయం తెలిసింది. అమలాపురంలో ధ్వంసమైన ఇంట్లో మంత్రి పినిపె విశ్వరూప్ అద్దెకు ఉంటున్నారని తెలిసింది.
అమలాపురం బ్యాంకు కాలనీలో వీరభద్రరావు అనే వ్యక్తిది ఇల్లు.. ఇక్కడ మంత్రి రెంట్‌ చెల్లించి ఉంటున్నారు. ఈ ఇల్లు తాను నిర్మించి ఐదేళ్లు అవుతోందని ఆయన తెలిపారు. తాను రెండేళ్ల తర్వాత ఉద్యోగ రీత్యా కాకినాడ వెళ్లానని.. అప్పటి నుంచి విశ్వరూప్ అద్దెకు ఉంటున్నట్లు తెలిపారు. మూడేళ్లగా మంత్రి ఇక్కడే ఉంటున్నారని.. ఆయన మరో ఇల్లు నిర్మించుకుంటున్న విషయాన్ని చెప్పుకొచ్చారు. విశ్వరూప్ కొత్త ఇల్లు పూర్తైన తర్వాత అక్కడికి వెళదామనుకున్నారని.. తాను ఈ ఇంటికి వద్దామనుకున్నట్లు చెప్పారు. కానీ ఈలోపు ఇల్లంతా తగులబెట్టారు, ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఎంతో ఇష్టపడి, కష్టపడి నిర్మించానని.. 6వేల500 SFTలో కట్టుకున్నట్లు వీరభద్రరావు అంటున్నారు. ఈ విషయంపై ఇంకా మంత్రితో మాట్లాడలేదని..ఇల్లు చూద్దామని వచ్చానన్నారు. ఇంకా విశ్వరూప్‌ను కలవలేదని.. తర్వాత ఏమవుతుందో చూడాలన్నారు. ఇంటిని చూడగానే బాధగా అనిపించిందని.. రాజకీయాలతో తనకు సంబంధం లేదు.. తాను ప్రొఫెసర్‌ను అన్నారు. అయితే ఈ ఇల్లు రెండస్తుల్లో ఉంది.. దుండగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది. మరి ఈ ఇంటి యజమానికి మంత్రి ఏదైనా పరిహారం చెల్లిస్తారా, లేదా అన్నది చూడాలి.

కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి.. దీంతో ప్రభుత్వం 144 సెక్షన్ అమలు చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం అమలాపురంలో ఆందోళనకారులు ర్యాలీకి సిద్ధమయ్యారు.. కలెక్టరేట్‌ వైపు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

అక్కడితో ఆగని ఆందోనళకారులు బస్సుల్ని తగులబెట్టారు.. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి నిప్పు పెట్టారు. బయటకు ఉన్న బైకుల్ని కూడా దగ్థం చేశారు.. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో అమలాపురం రణరంగాన్ని తలపించింది.. తర్వాత అదనపు బలగాలను అక్కడికి తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.