యాప్నగరం

తూ.గో: భర్త చనిపోయి దుఖంలో ఉంటే.. అక్రమ సంబంధం అంటగట్టి.. షాకింగ్!

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది.

Samayam Telugu 28 Mar 2021, 8:01 pm
తూర్పు గోదావరి జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఓవైపు భర్త చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న మహిళకు అక్రమ సంబంధం అంటగట్టి.. ఇంటి నుంచి వెళ్లిపోవాలని కొందరు దుర్మార్గులు వేధించారు. దీంతో అవమానభారంతో కుమిలిపోయిన ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


స్థానిక ఎస్సై బి.సంపత్‌కుమార్‌ తెలిపిన వివరాలు మేరకు.. ఏలేశ్వరం పట్టణంలోని మందుల కాలనీలో నివాసం ఉంటూ ప్లాస్టిక్‌ సామాన్లు విక్రయించే పెండ్ర సత్తిబాబుకు విజయనగరానికి చెందిన అప్పయ్యమ్మ (35) అనే మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, ఇటీవలే ఆమె భర్త సత్తిబాబు మృతి చెందడంతో.. మందుల కాలనీలోని అత్తవారింట్లోనే నివాసం ఉంటూ జీవనం సాగిస్తోంది.

ఈ క్రమంలో అప్పయ్యమ్మకు కొందరు స్థానికులు మరొక వ్యక్తితో అక్రమ సంబంధం అంటగట్టారు. తర్వాత ఊరు విడిచిపెట్టి తమ స్వగ్రామమైన విజయనగరం వెళ్లిపోవాలని ఆమెను బెదిరించారు. స్థానికుల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన అప్పయ్యమ్మ.. తలలో పేలు చంపేందుకు వాడే మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

దీంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి అత్త పెండ్ర ముత్యాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కోడలు చనిపోవడానికి మొత్తం 9 మంది వ్యక్తులు కారణమని ముత్యాలమ్మ ఆరోపించింది. దీంతో ఆయా వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సంపత్ కుమార్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.